టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టుపై భారత్ అద్భుత విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లిన వేళ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోరు సాగుతోంది. భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ ఆమిర్ను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భారత్ సెమీఫైనల్కు చేరదని.. ఇంగ్లాండ్ గెలుస్తుందని ఆమిర్ చేసిన జోస్యాలను సిద్ధూ ఎద్దేవా చేశారు.
ఆమిర్ ఒక "దొంగ బాబా"
ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ.. మహమ్మద్ ఆమిర్ను "దొంగ బాబా" అని సంబోధించారు. "మన చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులకు తప్పుడు అంచనాలు వేయడం అలవాటుగా మారింది. అది నిజమైతే తాము గొప్ప జ్ఞానులమని చెప్పుకుంటారు, లేదంటే సైలెంట్గా ఉంటారు. అమీర్ చెప్పినవన్నీ తప్పని రుజువయ్యాయి. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు ముందడుగు వేస్తాయని చెప్పారు.. కానీ సంజూ శాంసన్ రాకతో ఆ రెండు జట్లు ఇంటికి వెళ్లాయి. ఇంగ్లాండ్ గెలుస్తుందని ఈరోజు చెప్పారు.. కానీ ఇంగ్లాండ్ కూడా ఓడిపోయింది" అని సిద్ధూ ఎద్దేవా చేశారు.

భిక్షాటనతో సింహాసనం దక్కదు
సిద్ధూ తనదైన శైలిలో మహమ్మద్ ఆమిర్పై విమర్శలు చేస్తూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "జోస్యాలు ఏమీ నిర్ణయించవు, ఫలితాలు మైదానంలో తేలుతాయి. భిక్షాటనతో సింహాసనం దక్కదు. ఖాళీ పాత్రలే ఎక్కువ శబ్దం చేస్తాయి. ఆమిర్ పరిస్థితి కూడా అలాగే ఉంది" అని మండిపడ్డారు. మ్యాచ్లు గెలవాలంటే మైదానంలో సత్తా చాటాలని, కేవలం మాటలతో కాదని హితవు పలికారు.
ఆమిర్ వాదన ఏంటి?
భారత్ విజయం సాధించినప్పటికీ మహమ్మద్ ఆమిర్ తన పంతాన్ని వీడలేదు. భారత్ గొప్పగా ఆడిందని అంగీకరిస్తూనే, ఇంగ్లాండ్ ఫీల్డింగ్ తప్పిదాల వల్లే ఓడిపోయిందని వాదించారు. "నేను క్రికెట్ గురించే మాట్లాడుతున్నాను. ఇంగ్లాండ్ ఓ ముఖ్యమైన క్యాచ్ వదిలేయడం వల్లే మ్యాచ్ ఓడిపోయింది. ఫామ్ లో ఉన్న బ్యాటర్ (సంజూ శామ్సన్) క్యాచ్ను హ్యారీ బ్రూక్ పట్టుకుని ఉంటే, ఇంగ్లాండ్ మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించేది. ఇరు జట్ల మధ్య తేడా కేవలం బుమ్రా మాత్రమే" అని ఆమిర్ తన కామెంట్లను సమర్థించుకున్నాడు.
ఫైనల్కు భారత్.. ప్రత్యర్థి న్యూజిలాండ్
ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ సెమీఫైనల్ పోరులో భారత్ 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఈ విజయంతో భారత్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్కు చేరుకుంది. అక్కడ కివీస్ (న్యూజిలాండ్) జట్టుతో భారత్ టైటిల్ పోరులో తలపడనుంది.