బలవంతంగా పక్కనపెట్టలేదు..
ఈ మ్యాచ్ నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడిన బ్యాటింగ్ కోచ్.. వరల్డ్ కప్ ప్రిపరేషన్స్కు 20 మ్యాచ్లు సరిపోతాయన్నాడు. 'సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్లను బలవంతంగా బయట కూర్చోబెట్టలేదు. మిగతా ఆటగాళ్లూ ఉత్తమంగా ఆడుతున్నారు. ఆటగాళ్లుగా ఈ విషయాన్ని సూర్య, ఇషాన్ అర్థం చేసుకోవాలి. తమ అవకాశం కోసం వీళ్లు ఎదురు చూడాల్సిందే. అందుకు వీళ్లు సిద్ధంగానే ఉన్నారు. తీవ్ర సాధన కొనసాగిస్తున్నారు. ఎప్పుడూ అవకాశం వచ్చినా వీళ్లు మెరుగ్గా రాణించి జట్టులో స్థానాన్ని నిలబెట్టుకుంటారు. ఇషాన్ కిషన్ను బ్యాకప్ ఓపెనర్గానే ఎంపిక చేశారు.
సూర్య విలక్షణ బ్యాటర్..
ఒకవేళ జట్టుకు అవసరం ఉంటే మిడిలార్డర్లో ఆడించే ఛాన్స్ ఉంది. మెరుగైన సామర్థ్యం ఉన్న సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. అవకాశం వచ్చినప్పుడు వన్డే జట్టులోకి వచ్చి సత్తాచాటుతాడు. అలాంటి విలక్షణ ఆటగాడు జట్టులో ఉండడం కలిసొచ్చే అంశం. జట్టులోని ముఖ్య ఆటగాళ్లకు ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ దిశగా సన్నద్ధమవడానికి 20 మ్యాచ్లు చాలు. ముఖ్య ఆటగాళ్లపై ప్రత్యేక దృష్టి సారించాం. కొన్ని విభాగాల్లో మాత్రమే మెరుగవాల్సి ఉంది. మరోవైపు నెట్స్లో బ్యాటింగ్లో కష్టపడేలా లోయర్ ఆర్డర్ ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్నాం. జడేజా తిరిగి జట్టులోకి వచ్చాక అతనితో పాటు అక్షర్, వాషింగ్టన్ సుందర్ రూపంలో ముగ్గురు నాణ్యమైన స్పిన్ ఆల్రౌండర్లు జట్టుకు అందుబాటులో ఉంటారు'అని విక్రమ్ అన్నాడు.
క్లీన్ స్వీప్ దిశగా..
శ్రీలంకతో చివరి వన్డే మ్యాచ్కు భారత్ సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్ను ఇప్పటికే 2-0తో దక్కించుకున్న భారత్.. ఇక క్లీన్స్వీప్పై కన్నేసింది. ఆదివారం మ్యాచ్లో గెలిచి లంకతో సున్నా చుట్టించడంతో పాటు న్యూజిలాండ్తో సిరీస్కు ముందు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలన్నది రోహిత్ సేన లక్ష్యం. గత రెండు వన్డేల్లోనూ టీమ్ఇండియా విభిన్న పరిస్థితులను ఎదుర్కొంది. తొలి మ్యాచ్లో బ్యాటింగ్లో చెలరేగి అలవోకగా గెలిచిన జట్టు.. రెండో వన్డేలో తడబడి, కష్టపడి నెగ్గింది. అయితే గత మ్యాచ్లో బౌలర్లు సత్తాచాటడం జట్టుకు కలిసొచ్చే అంశం. అదే జోరులో ఇప్పుడు మూడో వన్డేలోనూ ప్రత్యర్థిని చిత్తుచేయాలని చూస్తోంది.