ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ తుది దశకు చేరింది. భారత్-న్యూజిలాండ్ మధ్య ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్తో ఈ మెగా టోర్నీ ముగియనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా హాట్ ఫేవరేట్గా ఈ మ్యాచ్ బరిలోకి దిగుతోంది. వరుసగా రెండో టైటిల్ గెలిచి సరికొత్త చరిత్రను లిఖించాలని టీమిండియా భావిస్తోంది.
మరోవైపు తొలి టీ20 ప్రపంచకప్ను ముద్దాడాలనే కసితో న్యూజిలాండ్ ఉంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. కప్ గెలిచినా.. ఓడినా సూర్య కెరీర్కు ఈ మ్యాచ్తో ఎండ్ కార్డ్ పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం 35 ఏళ్ల వయసులో ఉన్న సూర్యకుమార్ యాదవ్.. కేవలం టీ20 ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నాడు. ఇప్పటి వరకు అతను ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడాడు. రెండేళ్లు వన్డే జట్టులో కొనసాగినా.. 2023 ప్రపంచకప్ ఫైనల్లో పేలవ ప్రదర్శనతో వేటుకు గురయ్యాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన తర్వాత రోహిత్, కోహ్లీ, జడేజా ఒకేసారి టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికారు. రోహిత్ స్థానంలో టీ20 సారథ్య బాధ్యతలు అందుకున్న సూర్యకుమార్ యాదవ్.. జట్టును అద్భుతంగా నడిపించాడు. అతని సారథ్యంలో భారత్ ఒక్కటంటే ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. సొంతగడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026లోనూ భారత్ ఫైనల్ చేరుకుంది.

ఆదివారం న్యూజిలాండ్తో ఫైనల్లో విజయం సాధిస్తే.. టీమిండియాకు ప్రపంచకప్ అందించిన సారథుల జాబితాలోకి సూర్య చేరుతాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలకడానికి ఇంతకంటే మంచి సందర్భం అతనికి మరొకటి ఉండదు. సూర్య వయసు కూడా పైబడింది. ఫామ్ తగ్గింది. కెరీర్ చరమాంకంలోనే ఉన్నాడు. కాబట్టి రిటైర్మెంట్కు ఇదే సరైన సమయమని విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచకప్ గెలిచి తప్పుకుంటే అంతకంటే గొప్ప వీడ్కోలు ఏం ఉంటుంది? అయితే ఇది అతని ఛాయిస్ అని అభిప్రాయపడుతున్నారు.

ఒకవేళ భారత్ ఫైనల్లో ఓడినా.. సూర్య కెరీర్ ముగుస్తుంది. సెలెక్టర్లు వేటు వేసే అవకాశాలే ఎక్కువ. తదుపరి టీ20 ప్రపంచకప్ టోర్నీకి కుర్రాళ్లతో కూడిన సెటప్ను టీమిండియా సిద్దం చేస్తుంది. కాబట్టి సూర్యకు అవకాశం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో సెలెక్టర్లు అవకాశం ఇవ్వడం కంటే గౌరవంగా తప్పుకోవడమే ఉత్తమమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సూర్య ఆటలో వెనకబడిపోయాడు.
సారథి కాకముందు 68 మ్యాచ్లు ఆడిన సూర్య 43.33 సగటుతో 2340 పరుగులు చేశాడు. అందులో 4 సెంచరీలు ఉన్నాయి. కానీ కెప్టెన్ అయ్యాక 41 మ్యాచ్లు ఆడి 26.62 సగటుతో 932 పరుగులే చేశాడు. సూర్య సారథ్యంలో భారత్ గెలిచినా.. అందులో అతని గొప్పతనం ఏం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి.
ఈ మెగా టోర్నీని ఘనంగా ప్రారంభించిన సూర్య... ఆ జోరును కొనసాగించలేకపోయాడు. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్లో 84 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కానీ ఆ తర్వాత ఆడిన ఒక్క మ్యాచ్లోనూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. కనీసం ఫైనల్లోనైనా బ్యాట్ ఝులిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కోహ్లీలా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచి ఆట నుంచి తప్పుకుంటే... అంతకంటే గౌరవం ఏం ఉంటుందని కామెంట్ చేస్తున్నారు.
