ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తున్నప్పటికీ.. తెరవెనుక కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా జట్టు స్టార్ ఆల్రౌండర్, వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఒకానొక దశలో జట్టు యాజమాన్యం నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. సూపర్-8 దశలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్లో తనను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించడం అక్షర్కు అస్సలు నచ్చలేదు. ఈ విషయాన్ని భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా జరిగిన మీడియా సమావేశంలో స్వయంగా వెల్లడించాడు.

నిర్ణయం వెనుక ఉన్న కారణాలు
అహ్మదాబాద్లో న్యూజిలాండ్తో జరగనున్న గ్రాండ్ ఫైనల్కు ముందు మాట్లాడిన సూర్య.. అక్షర్ పటేల్ తొలగింపు వెనుక ఉన్న వ్యూహాన్ని వివరించాడు. ప్రత్యర్థి జట్టులోని ఆటగాళ్ల బలహీనతలు, పిచ్ పరిస్థితులను బట్టి చేసే 'మ్యాచ్-అప్స్' ఆధారంగానే కోచ్ గౌతమ్ గంభీర్, తాను కలిసి ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లకు వ్యతిరేకంగా వేరే బౌలింగ్ ఆప్షన్ బాగుంటుందని భావించి అక్షర్ను పక్కన పెట్టాల్సి వచ్చిందని సూర్య స్పష్టం చేశాడు.

అక్షర్ పటేల్ రియాక్షన్.. బుజ్జగింపులు
జట్టు నుంచ్ తనను తప్పించారనే వార్త వినగానే అక్షర్ పటేల్ చాలా కోపానికి గురయ్యాడు. దీనిపై సూర్య స్పందిస్తూ.. "మేము ఆ నిర్ణయాన్ని అక్షర్కు చెప్పినప్పుడు అతను అస్సలు సంతోషంగా లేడు. ఒక మ్యాచ్ విన్నర్ హోదాలో ఉన్న ఆటగాడు జట్టులో చోటు కోల్పోయినప్పుడు అలా ఫీల్ అవ్వడం సహజమే. అయితే జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో మేము అతనికి కూర్చోబెట్టి వివరించాం" అని పేర్కొన్నాడు. ఆ తర్వాత అక్షర్ పరిస్థితిని అర్థం చేసుకుని జట్టుతో మమేకమయ్యాడు.
బెడిసికొట్టిన వాషింగ్టన్ సుందర్ ప్రయోగం
దక్షిణాఫ్రికాతో జరిగిన ఆ మ్యాచ్లో అక్షర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ను జట్టులోకి తీసుకున్నారు. అయితే టీమ్ మేనేజ్మెంట్ ఆశించిన ఫలితం దక్కలేదు. సుందర్ ఆ మ్యాచ్లో ప్రభావం చూపలేకపోగా.. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడి. ఫలితంగా భారత్ ఆ మ్యాచ్లో 76 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ ప్రయోగం విఫలమైనప్పటికీ.. ఆ తర్వాత జరిగిన సెమీఫైనల్లో అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చి, ఇంగ్లాండ్పై అద్భుతమైన ఫీల్డింగ్తో రెండు కీలక క్యాచ్లు పట్టి తన విలువను చాటుకున్నాడు.

వరుణ్ చక్రవర్తి ఫామ్పై సూర్య ధీమా
ఇదే క్రమంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పేలవమైన ఫామ్పై కూడా కెప్టెన్ స్పందించాడు. సెమీఫైనల్లో వరుణ్ 4 ఓవర్లలో 64 పరుగులు ఇచ్చి ధారాళంగా పరుగులు సమర్పించుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ సూర్యకుమార్ వరుణ్ చక్రవర్తిపై నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. "వరుణ్ ఫామ్ గురించి మాకు ఎటువంటి ఆందోళన లేదు. జట్టుగా మేము గెలుస్తున్నప్పుడు చిన్న చిన్న లోపాలను పెద్దగా పట్టించుకోము. ప్రస్తుతం డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఫైనల్ ఆడటం ఒక గొప్ప అనుభూతి, దాని కోసం అందరూ సిద్ధంగా ఉన్నారు" అని సూర్య ముగించాడు.