అప్పుడు లక్ష్మణ్, రాయుడు..
2003 వన్డే ప్రపంచకప్లో హైదరాబాద్ సొగసరి బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ను కాదని చివర్లో దినేశ్ మోంగియాను జట్టులోకి తీసుకున్నారు. ఆ టోర్నీలో సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని భారత్.. ఫైనల్ చేరి ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడింది. ఈ టోర్నీ ఆధ్యాంతం అదరగొట్టిన గంగూలీసేన ఫైనల్లో మాత్రం పేలవ బౌలింగ్, చెత్త బ్యాటింగ్తో రన్నరప్గా నిలిచింది.
2019 వన్డే ప్రపంచకప్ టైమ్లో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడును కాదని త్రీడీ ప్లేయర్ పేరిట విజయ్ శంకర్కు అవకాశమిచ్చారు. చివరకు భారత్.. సెమీస్లో న్యూజిలాండ్ చేతిలో ఓడి ఇంటి దారి పట్టింది. ఈ వ్యవహారం ఇప్పటికీ చర్చనీయాంశం అవుతూనే ఉంటుంది.
ఇప్పుడు హనుమ విహారీ..
తాజాగా వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ హనుమ విహారిని తీసుకోకుండా 3డీ ప్లేయరంటూ రవీంద్ర జడేజాకు అవకాశమిచ్చారు. తీరా ఈ మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడి రెండేళ్ల కష్టాన్ని బూడిద పాలు చేసింది.
ఈ మ్యాచ్లో ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగి టీమిండియా మూల్యం చెల్లించుకుంది. అశ్విన్ ప్రభావం చూపినప్పటికీ.. జడేజా పెద్దగా రాణించిందేం లేదు. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్లో తేలిపోయాడు. అయితే ఇలా ఐసీసీ టోర్నీల్లో తెలుగు క్రికెటర్లను పక్కన పెట్టిన ప్రతీసారి భారత్ చిత్తుగా ఓడింది.
కేన్ మామ సూపర్ ఇన్నింగ్స్..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ విధించిన 139 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 45.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 140 రన్స్ చేసి అలవోకగా విజయాన్నందుకుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్(89 బంతుల్లో 8 ఫోర్లతో 52 నాటౌట్), రాస్ టేలర్ (100 బంతుల్లో 6 ఫోర్లు 47 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఇద్దరు ఏకంగా 96 భాగస్వామ్యాన్ని నెలకొల్పి చిరస్మరణీయ విజయాన్నందించారు.
ఇది న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో తొలి ఐసీసీ టైటిల్. ఇక 64/2 ఓవర్నైట్ స్కోర్తో చివరి రోజు సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 73 ఓవర్లలో 170 పరుగులకే ఆలౌటైంది. రిషభ్ పంత్(41), రోహిత్ శర్మ(30) టాప్ స్కోరర్లుగా నిలవగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ(13), పుజారా(15), రహానే (15), జడేజా(16), అశ్విన్(7) దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ నాలుగు, ట్రెంట్ బౌల్ట్ మూడు, కైల్ జెమీసన్ రెండు వికెట్లు తీయగా.. నీల్ వాగ్నర్కు ఓ వికెట్ దక్కింది.