టీ20 ప్రపంచ కప్ 2026 తర్వాత బీసీసీఐ తన పూర్తి దృష్టిని 2027 వన్డే ప్రపంచ కప్పై మళ్లించనుంది. ఈ నేపథ్యంలో సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు గరిష్టంగా వన్డే మ్యాచ్లు ఆడే అవకాశం కల్పించాలని భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) భావిస్తోంది. దీనికి తగ్గట్టుగానే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇచ్చిన ఓ ఆసక్తికరమైన ప్రతిపాదనకు బీసీసీఐ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

ఈ ఏడాది ద్వితీయార్థంలో టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. పాత షెడ్యూల్ ప్రకారం అక్కడ 5 టీ20లు, 2 వన్డేలు, 2 టెస్టులు ఆడాలి. అయితే 2027 వన్డే వరల్డ్ కప్ సన్నాహాల దృష్ట్యా టీ20ల సంఖ్యను తగ్గించి.. వన్డేల సంఖ్యను పెంచాలని న్యూజిలాండ్ ప్రతిపాదించింది. 5 టీ20లకు బదులుగా 3 టీ20లు ఆడి, వన్డేల సంఖ్యను రెండు నుంచి 4 లేదా 5కు పెంచే అవకాశం ఉంది. దీనివల్ల అటు న్యూజిలాండ్ బోర్డుకు కమర్షియల్గా (బ్రాడ్కాస్టర్ల ద్వారా) లాభం చేకూరడంతో పాటు, భారత్కు వరల్డ్ కప్ ప్రాక్టీస్ లభిస్తుంది. కోహ్లీ, రోహిత్ వంటి స్టార్ ప్లేయర్లు ఎక్కువ సేపు మైదానంలో ఉంటే వ్యూయర్షిప్, ఆదాయం భారీగా పెరుగుతుందని కివీస్ బోర్డు అంచనా వేస్తోంది.

ఐపీఎల్ 2026 మే నెలలో ముగిసిన తర్వాత టీమిండియా పూర్తిగా వన్డే మోడ్లోకి వెళ్లనుంది. జూన్ నెలలో ఆఫ్ఘనిస్తాన్తో మూడు వన్డేల సిరీస్తో ఈ వేట మొదలవుతుంది. ఆ తర్వాత జులైలో ఇంగ్లాండ్ పర్యటనలో 3 వన్డేలు, అనంతరం వెస్టిండీస్, శ్రీలంకలతో కీలక సిరీస్లు ఉన్నాయి. ఏడాది చివరలో న్యూజిలాండ్తో పెరగనున్న వన్డేల సంఖ్యతో కలిపి, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ ఏడాది దాదాపు 15 నుంచి 18 వన్డేలు ఆడే అవకాశం ఉంది. ఇది వారు 2027 ప్రపంచ కప్కు పూర్తిస్థాయిలో సన్నద్ధమవ్వడానికి, యువ ఆటగాళ్లతో సమన్వయం సాధించడానికి గొప్ప అవకాశంగా మారనుంది.

ప్రస్తుతానికి ఈ మార్పులపై బీసీసీఐ లేదా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే రెండు బోర్డుల మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే సవరించిన వైట్-బాల్ షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, క్రికెట్ అభిమానులకు కోహ్లీ-రోహిత్ సుదీర్ఘమైన వన్డే ఇన్నింగ్స్లను చూసే అదృష్టం దక్కుతుంది. వన్డే ఫార్మాట్కు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడంలో ఈ సిరీస్ కీలక పాత్ర పోషించనుంది.