ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో టీమిండియాను ఓడిస్తామని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ధీమా వ్యక్తం చేశాడు. స్టేడియంలోని ప్రేక్షకులను నిశ్శబ్దంగా ఉంచడమే తమ లక్ష్యమని పేర్కొన్నాడు. సొంతగడ్డపై టైటిల్ నిలబెట్టుకోవాలనే ఒత్తిడి భారత్పై ఉందని, అదే తమకు అడ్వాంటేజ్ అని అభిప్రాయపడ్డాడు.
ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టైటిల్ నిలబెట్టుకోవాలని టీమిండియా భావిస్తుండగా.. తొలి టీ20 ప్రపంచకప్ను ముద్దాడాలనే లక్ష్యంతో కివీస్ ఉంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో శనివారం మీడియా సమావేశంలో పాల్గొన్న మిచెల్ సాంట్నర్.. ఈ మ్యాచ్ కోసం తమ జట్టు ఉత్సాహంగా ఎదురు చూస్తుందని చెప్పాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. స్టేడియంలోని ప్రేక్షకులను నిశ్శబ్దంగా ఉంచడమే తమ లక్ష్యమని సాంట్నర్ పేర్కొన్నాడు.

'స్టేడియంలోని ప్రేక్షకులను మౌనంగా ఉంచడమే మా లక్ష్యం. అయితే క్రికెట్లో ఎన్నో సవాళ్లు ఉంటాయి. స్వదేశంలో గెలవాలనే ఒత్తిడి భారత్పై ఎక్కువగా ఉంటుంది. ఇది తమకు అడ్వాంటేజ్. ఫైనల్కు తయారు చేసిన వికెట్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నా. నేను ఇంకా వికెట్ చూడలేదు. పిచ్ ఇంకా కవర్ల కిందే ఉంది.
జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుత ఫామ్ గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకోవాలి. ఇంగ్లండ్ బ్యాటర్లను అతను చాలా ఇబ్బంది పెట్టాడు. ఆ రాత్రి భారత్ విజయంలో అతను గేమ్ ఛేంజర్గా నిలిచాడు. బుమ్రా ప్రపంచ స్థాయి బౌలర్ అని మాకు తెలుసు. కానీ జట్టులో అతను ఒక్కడే కాదు. బ్యాటింగ్లోనైనా, బౌలింగ్లోనైనా భారత జట్టులోని ప్రతి ఒక్కరూ వేర్వేరు సమయాల్లో రాణిస్తూ జట్టును ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక జట్టుగా ఉండాల్సిన తీరు ఇదే. అయితే టైటిల్ గెలిచి భారత అభిమానుల హృదయాలను ముక్కలు చేసేందుకు తాము వెనుకాడం. ఫైనల్లో మా అత్యత్తమ ప్రదర్శన కనబరుస్తాం.'అని మిచెల్ సాంట్నర్ చెప్పుకొచ్చాడు.
గత దశాబ్ద కాలంలో న్యూజిలాండ్ పలుమార్లు ఐసీసీ ఫైనల్స్కు చేరుకున్నప్పటికీ.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఇప్పటివరకు ఒక్క ప్రపంచ కప్ కూడా గెలవలేదు. ఈసారి ఎలాగైనా ఆ లోటును తీర్చుకోవాలని పట్టుదలతో న్యూజిలాండ్ ఉంది. సెమీఫైనల్లో పటిష్టమైన సౌతాఫ్రికాను మట్టికరిపించిన న్యూజిలాండ్.. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది.