టీమిండియా అసాధారణ ప్రదర్శనతో తమను మట్టికరిపించిందని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ అన్నాడు. సొంతగడ్డపై లక్షాలాది అభిమానుల మధ్య తీవ్ర ఒత్తిడిలో టీమిండియా అసాధారణ ప్రదర్శన కనబర్చి విజేతగా నిలిచిందని కొనియాడాడు. ఈ విషయంలో భారత్ను అభినందించాల్సిందేనన్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విజేతగా నిలిచింది. ముచ్చటగా మూడో టీ20 ప్రపంచకప్ను అందుకోవడంతో పాటు వరుసగా రెండో టైటిల్ గెలిచిన జట్టుగా.. సొంతగడ్డపై టైటిల్ అందుకున్న టీమ్గా చరిత్ర సృష్టించింది.
ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన టీమిండియా 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన మిచెల్ సాంట్నర్.. ఈ మ్యాచ్లో ఓడినా గర్వంగా ఉందని చెప్పాడు. భారత్ అద్భుత ప్రదర్శన ముందు తమ జట్టు తేలిపోయిందని అంగీకరించాడు.

'ఫైనల్ వరకు చేరుకున్నందుకు నా జట్టు సభ్యులను చూసి గర్విస్తున్నాను. ఈ టోర్నీ ఆసాంతం మాకు సవాళ్లు ఎదురయ్యాయి. ఈ రాత్రి లక్షలాది ప్రేక్షకుల సమక్షంలో.. ఒక అత్యుత్తమ జట్టు చేతిలో మేం ఓడిపోయాం. ఇక్కడ మేం ఆడే చాలా మ్యాచ్ల్లో ప్రేక్షకుల మద్దతు ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది. స్వదేశంలో ప్రపంచకప్ గెలవడం చాలా ఒత్తిడితో కూడుకున్న పని. ఈ విషయంలో భారత్ను అభినందించాలి.
సూర్యకుమార్ యాదవ్, అతని బృందం చేసిన కృషికి గర్వపడాలి. మా జట్టులో వేర్వేరు సమయాల్లో వేర్వేరు ఆటగాళ్లు రాణించారు. సూపర్-8, సెమీఫైనల్స్లో మేం మంచి ప్రదర్శన ఇచ్చాం. కానీ ఈ రాత్రి భారత్ మూడు విభాగాల్లో రాణించి మమ్మల్ని ఓడించింది. ఈ మ్యాచ్లో ఓడినా.. ఈ స్థాయికి వచ్చినందుకు మా ఆటగాళ్లు గర్వపడాలి.'అని మిచెల్ సాంట్నర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 255 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాప్-3 బ్యాటర్లు సంజూ శాంసన్(46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 89), అభిషేక్ శర్మ(21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 52), ఇషాన్ కిషన్(25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 54) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. చివర్లో శివమ్ దూబే(8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 26 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమ్స్ నీషమ్(3/46) మూడు వికెట్లు తీయగా.. మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర చెరో వికెట్ తీసారు.
అనంతరం న్యూజిలాండ్ 159 పరుగులకు ఆలౌటైంది. టీమ్ సీఫెర్ట్(26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిచెల్ సాంట్నర్(35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 43) పరుగులతో పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(4/15) నాలుగు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(3/27) మూడు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ, అభిషేక్ శర్మ తలో వికెట్ తీసారు. భారత బౌలర్ల ధాటికి ఈ మ్యాచ్ ఏక పక్షంగా ముగిసింది.