టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఫైనల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్గా నిలిచాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న ఫైనల్లో అభిషేక్ శర్మ ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. పేలవ ఫామ్తో ఈ టోర్నీ ఆసాంతం తడబడిన అభిషేక్ శర్మ.. అసలు సిసలు ఫైనల్లో తన సత్తా ఏంటో చూపించాడు. విధ్వంసకర ఇన్నింగ్స్తో విమర్శకుల నోళ్లు మూయించాడు. క్రీజులో సెట్ అయ్యేందుకు కాస్త సమయం తీసుకున్న అభిషేక్ శర్మ.. 6 ఫోర్లు, 3 సిక్స్లతో 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

తద్వారా హెన్రీచ్ క్లాసెన్ పేరిట ఉన్న రికార్డ్ను అధిగమించాడు. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో హెన్రీచ్ క్లాసెన్ 23 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కాగా.. తాజా ఇన్నింగ్స్తో అభిషేక్ శర్మ అధిగమించాడు. అభిషేక్ శర్మ ధాటికి ఈ మ్యాచ్లో టీమిండియా పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర బౌలింగ్లో అభిషేక్ శర్మ వెనుదిరిగినా.. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగుతున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 255 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాప్-3 బ్యాటర్లు సంజూ శాంసన్(46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 89), అభిషేక్ శర్మ(21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 52), ఇషాన్ కిషన్(25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 54) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. చివర్లో శివమ్ దూబే(8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 26 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
న్యూజిలాండ్ బౌలర్లలో జేమ్స్ నీషమ్(3/46) మూడు వికెట్లు తీయగా.. మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర చెరో వికెట్ తీసారు. భారత బ్యాటర్ల ధాటికి న్యూజిలాండ్ బౌలర్లకు ఏడుపు ఒక్కటే తక్కువైంది. ఈ టోర్నీలో భారత్ మూడోసారి 250 ప్లస్ స్కోర్ నమోదు చేసింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్.