టీమిండియా చరిత్ర సృష్టించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టీ20 ప్రపంచకప్ను నిలబెట్టుకోవడంతో పాటు సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. 140 కోట్ల భారతీయుల అంచనాలను నిజం చేస్తూ అహ్మదాబాద్ వేదికగా జరిగిన తుది పోరులో న్యూజిలాండ్ను మట్టికరిపించి టీమ్ ఇండియా 'విశ్వవిజేత'గా నిలిచింది.
పవర్ప్లేలో అభిషేక్ శర్మ పరుగుల సునామీ సృష్టిస్తే.. మిడిల్ ఓవర్లలో సంజూ శాంసన్ క్లాస్ అండ్ మాస్ ఇన్నింగ్స్, చివర్లో శివమ్ దూబే మెరుపులు టీమిండియా రికార్డ్ స్కోర్ను అందించాయి. బౌలింగ్లో బుమ్రా బౌలింగ్ పదును.. బాపు అక్షర్ పటేల్ తీన్మార్ వెరసి భారత్ను మళ్ళీ సింహాసనంపై కూర్చోబెట్టాయి. ఇది కేవలం ఒక విజయం మాత్రమే కాదు.. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి తీర్చుకున్న మధురమైన ప్రతీకారం. స్టేడియంలో ప్రతిధ్వనిస్తున్న 'వందేమాతరం' నినాదాల మధ్య, భారత్ మూడో టీ20 ప్రపంచకప్ను ముద్దాడింది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన భారత్ 96 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన టీమిండియా.. మువ్వెన్నల జెండాను రెపరెపలాడించింది. మరోసారి న్యూజిలాండ్కు కన్నీరే మిగిలింది.

256 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 159 పరుగులకు ఆలౌటైంది. టీమ్ సీఫెర్ట్(26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిచెల్ సాంట్నర్(35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 43) పరుగులతో పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(4/15) నాలుగు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(3/27) మూడు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ, అభిషేక్ శర్మ తలో వికెట్ తీసారు. భారత బౌలర్ల ధాటికి ఈ మ్యాచ్ ఏక పక్షంగా ముగిసింది.
అంతకుముందు భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 255 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాప్-3 బ్యాటర్లు సంజూ శాంసన్(46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 89), అభిషేక్ శర్మ(21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 52), ఇషాన్ కిషన్(25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 54) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. చివర్లో శివమ్ దూబే(8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 26 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
న్యూజిలాండ్ బౌలర్లలో జేమ్స్ నీషమ్(3/46) మూడు వికెట్లు తీయగా.. మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర చెరో వికెట్ తీసారు. భారత బ్యాటర్ల ధాటికి న్యూజిలాండ్ బౌలర్లకు ఏడుపు ఒక్కటే తక్కువైంది. ఈ టోర్నీలో భారత్ మూడోసారి 250 ప్లస్ స్కోర్ నమోదు చేసింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్.