ఐసీసీ టీ20 ప్రపంచకప్ను నిలబెట్టుకునేందుకు డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా అడుగు దూరంలో నిలిచింది. వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంగ్లండ్తో గురువారం వాంఖడే వేదికగా ఉత్కంఠగా సాగిన పోరులో భారత్ 7 పరుగుల తేడాతో గట్టెక్కింది. ఈ విజయంతో అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడటం ఇదే తొలిసారి.
గతేడాది జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ భారత్, న్యూజిలాండ్ ఫైనల్లో తలపడ్డాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత న్యూజిలాండ్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. ఈసారైనా విజేతగా నిలిచి పొట్టి కప్ నిరీక్షణకు తెరదించాలని ఆ జట్టు భావిస్తోంది. మరోవైపు వరుసగా రెండో టైటిల్ గెలిచి చరిత్రను తిరగరాయాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. ఇప్పటి వరకు ఆతిథ్య జట్టు టీ20 ప్రపంచకప్ గెలవలేదు. అంతేకాకుండా డిఫెండింగ్ ఛాంపియన్ టైటిల్ నిలబెట్టుకోలేదు. ఈ క్రమంలోనే హిస్టరీ డిఫీట్.. హిస్టరీ రిపీట్ అనే నినాదంతో భారత్ దూసుకెళ్తోంది.

ఈ ఫైనల్ మ్యాచ్కు ఎలాంటి వర్ష సూచన లేకున్నా.. ఈ మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి? ఐసీసీ రూల్స్ ఎలా ఉన్నాయనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్కు మార్చి 9(సోమవారం)ని ఐసీసీ రిజర్వ్ డేగా కేటాయించింది. ఫైనల్ జరిగే ఆదివారం(మార్చి 8) వర్షం పడితే.. రిజర్వ్ డే అయిన మరుసటి రోజు ఆడిస్తారు.
ముందుగా నిర్ణయించిన రోజున కనీస ఓవర్ల ఆట కూడా సాధ్యం కాకపోతే.. మ్యాచ్ను రిజర్వ్ డే రోజు ఫ్రెష్గా నిర్వహిస్తారు. ఒకవేళ మొదటి రోజు ఆట ప్రారంభమై మధ్యలో నిలిచిపోతే.. రిజర్వ్ డేన ఎక్కడైతే ఆట ఆగిపోయిందో అక్కడి నుంచే మ్యాచ్ కొనసాగుతుంది.
మ్యాచ్ను తొలి రోజు పూర్తి చేయడానికి అంపైర్లు ప్రయత్నిస్తారు. ఇందుకోసం షెడ్యూల్ సమయం కంటే అదనంగా 120 నిమిషాల (2 గంటలు) సమయాన్ని కేటాయిస్తారు.

సాధారణ గ్రూప్ దశ మ్యాచ్ల్లో ఫలితం కోసం ఇరు జట్లు కనీసం 5 ఓవర్లు ఆడాలి. కానీ సెమీఫైనల్, ఫైనల్ వంటి నాకౌట్ మ్యాచ్ల్లో ఫలితం తేలాలంటే రెండు జట్లు కనీసం 10 ఓవర్ల చొప్పున బ్యాటింగ్ చేయాలి.
ఒకవేళ మ్యాచ్ పూర్తయి.. టై అయితే విజేతను తేల్చడానికి సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. సూపర్ ఓవర్ కూడా టై అయితే.. ఫలితం తేలే వరకు వరుసగా సూపర్ ఓవర్లు నిర్వహిస్తారు. సూపర్ ఓవర్లు ఆడించలేని పరిస్థితి నెలకొంటే ఇరు జట్లను విజేతగా ప్రకటిస్తారు.
ఒకవేళ భారీ వర్షం లేదా ఇతర కారణాల వల్ల నిర్ణీత రోజు, రిజర్వ్ డే.. రెండు రోజుల్లో కూడా కనీసం 10 ఓవర్ల ఆట సాధ్యం కాకపోతే.. ఐసీసీ నిబంధనల ప్రకారం ఇరు జట్లను ఉమ్మడి విజేతగా ప్రకటిస్తారు. సెమీఫైనల్స్లో అయితే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. కానీ ఫైనల్ రద్దయితే మాత్రం రెండు జట్లను విజేతలుగా ప్రకటించి ట్రోఫీని అందజేస్తారు.
