అలా చెప్పాల్సింది కాదు..
షకీబ్ క్షమాపణలు చెప్పడంపై బంగ్లాదేశ్ ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కడికి భయపడి క్షమాపణలు చెప్పడం బాలేదని ఆమె విమర్శించారు. ‘కోల్కతాలో కాళీ పూజలో పాల్గొన్నందుకు షకీబ్ క్షమాపణలు చెప్పకుండా ఉండాల్సింది. అతను క్షమాపణలు చెప్పడం ద్వారా హిందువుల పట్ల సానుభూతితో ఉన్న లేదా పూజా మండపాలను దర్శించుకున్న ముస్లింలను చంపుతామనే వారి బలం పెరిగినట్లయ్యింది. తాను చేసింది సరైందేనని షకీబ్ చెప్పాల్సింది. ప్రేమను పంచుకోవాలి, విద్వేషాన్ని తిరస్కరించాలి'అని ఆమె ట్వీట్ చేశారు.
షకీబ్.. సిగ్గు చేటు..
‘ఇస్లాంను విమర్శించినందుకు నన్ను ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ వేలాది ఇస్లామిక్ వాదులు బంగ్లాదేశ్ వీధుల్లో ప్రదర్శనలు నిర్వహించారు. నా తలకు ఖరీదు కట్టారు. ప్రభుత్వం నాపై కేసు నమోదు చేసింది. కానీ నేను క్షమాపణలు చెప్పలేదు. కానీ ఒక్కడు బెదిరించగానే షకీబ్ క్షమాపణలు చెప్పాడు. ఇది సిగ్గు చేటు'అని మరో ట్వీట్లో పేర్కొన్నారు. ఇక కాళీ మాతకు పూజ చేయడాన్ని సహించని సెల్హెట్కు చెందిన ఫండమెంటలిస్ట్ మోహ్సిన్ తాలుక్దుర్ ఫేస్ బుక్ లైవ్లో ఢాకాకు వెళ్లి మరీ షకీబ్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తానని బెదిరింపులకు దిగాడు.
ఎలాంటి పూజలు చేయలేదు..
అసలు తాను ఎలాంటి పూజలు నిర్వహించలేదని, ఇన్విటేషన్ కార్డులో వేరే పేరు ప్రస్తావించడంతోనే అక్కడికి వెళ్లానని షకీబ్ వివరణ ఇచ్చుకున్నాడు. తాను హాజరైన ఇతర ప్రోగ్రామ్లో కూడా మత సంబంధమైన కార్యక్రమాలు లేవన్నాడు. అయితే పూజ కార్యక్రమానికి హాజరైన తనను దీపాలు వెలిగించమని నిర్వాహకులు కోరితే సున్నితంగా తిరస్కరించానని తెలిపాడు. ఇక ఓ అభిమాని ఫోన్ పగలగొట్టాననే ప్రచారంలో కూడా వాస్తవం లేదని స్పష్టం చేశాడు. సెల్ఫీ కోసం ప్రయత్నించిన ఓ అభిమాని ఫోన్ ప్రమాదవశాత్తు పగిలిపోయిందని, దానికి తాను క్షమాపణలు కూడా చెప్పానన్నాడు.
ఏడాదిగా ఆటకు దూరం..
ఐసీసీ నిషేధం కారణంగా షకీబ్ గతేడాదిగా క్రికెట్కు దూరంగా ఉంటున్నా విషయం తెలిసిందే. 2019 వన్డే ప్రపంచకప్ ముంగిట మ్యాచ్ ఫిక్సింగ్ కోసం తనని ఓ బుకీ సంప్రదించగా.. ఆ విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక శాఖకు సమాచారం ఇవ్వకుండా షకీబ్ దాచాడు. దాంతో అతనిపై తొలుత రెండేళ్ల నిషేధం విధించిన ఐసీసీ.. ఆ తర్వాత తప్పును ఒప్పుకోవడంతో నిషేధాన్ని ఏడాదికి కుదించింది. ఈ ఏడాది అక్టోబరు 29తో అతనిపై ఉన్న నిషేధం గడువు ముగిసింది.
India vs Australia: పరిమిత ఓవర్ల సిరీస్ల నుంచి ఆసీస్ పేసర్ ఔట్!