టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. సుదీర్ఘకాలంగా ప్రేమలో ఉన్న తన స్నేహితురాలు, నటి ఆకృతి అగర్వాల్తో ఆదివారం(మార్చి 8) నిశ్చితార్థం చేసుకున్నాడు. తన ఎంగేజ్మెంట్ విషయాన్ని పృథ్వీ షానే ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు.
'మైదానంలో సిక్సర్ల నుంచి మైదానం బయట జీవితకాల హిట్స్ వరకు.. ఆమె నా పర్ఫెక్ట్ ఇన్నింగ్స్!' అనే క్యాప్షన్స్తో ఎంగేజ్మెంట్ ఫొటోలు పంచుకున్నాడు. ఈ ఫొటోల్లో పృథ్వీ షా మోకాళ్లపై కూర్చొని తన ప్రియురాలి చేతికి ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగాడు. ఎంగేజ్మెంట్ చేసుకున్న పృథ్వీషాకు సోషల్ మీడియా వేదికగా పలువురు క్రికెటర్లు, సెలెబ్రిటీలు అభినందనలు తెలుపుతున్నారు.
ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన ఆకృతి అగర్వాల్.. ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా, నటిగా రాణిస్తోంది. ముంబైలోని నిర్మలా మెమోరియల్ ఫాండేషన్ కాలేజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ డిగ్రీని పూర్తి చేసింది.
కరోనా సమయంలో డ్యాన్స్, లిప్ సింక్ వీడియోల ద్వారా సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించింది. ఇన్స్టాగ్రామ్లో ఆమెకు 3.4 మిలియన్ల (34 లక్షలు) కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమెకు ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. రాజేష్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'త్రిముఖ' అనే తెలుగు సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో ఆమె హీరోయిన్గా పరిచయం కాబోతుంది.

పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్ గత కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. బాహటంగానే తిరిగిన ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా కూడా ఫొటోలు షేర్ చేశారు. ఇటీవల అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకలో పృథ్వీ షా, ఆకృతి కలిసి హాజరయ్యారు. అర్జున్ పెళ్లి జరిగిన కొద్ది రోజుల్లోనే పృథ్వీ తన ఎంగేజ్మెంట్ వార్తను పంచుకోవడం విశేషం. ఐపీఎల్ 2026 సీజన్ తర్వాత పృథ్వీ షా, ఆకృతి పెళ్లి జరిగే అవకాశం ఉంది.
అప్కమింగ్ సీజన్లో పృథ్వీ షా ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడనున్నాడు. అండర్ 19 ప్రపంచకప్ విజయంతో భారత క్రికెట్లోకి దూసుకొచ్చిన పృథ్వీ షా అంతే వేగంగా జట్టుకు దూరమయ్యాడు. గాయాలు, ఫిట్నెస్ సమస్యలతో పాటు చెడు స్నేహాలు పృథ్వీ షా కెరీర్ను నాశనం చేశాయి. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో అతను అన్సోల్డ్గా నిలిచాడు. దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టు నుంచి తప్పుకున్న పృథ్వీ షా మహారాష్ట్ర తరఫున తన ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణించడంతో పృథ్వీ షాను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.75 లక్షల అతని కనీస ధరకు కొనుగోలు చేసింది.