ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ సరికొత్త చరిత్రను లిఖించింది. వ్యూయర్షిప్ పరంగా ఈ పొట్టి ప్రపంచకప్ ఆల్టైమ్ రికార్డ్ నమోదు చేసింది. ఇప్పటి వరకు భారత్లో దాదాపు 50 కోట్ల మంది ఈ టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్లను వీక్షించినట్లు ఐసీసీ ఛైర్మన్ జైషా తెలిపారు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇదే రికార్డని వెల్లడించారు. ఓటిటీ ఫ్లాట్ఫామ్ జియో హాట్స్టార్లోనే గరిష్టంగా 6.05 కోట్ల మంది వీక్షించినట్లు ఆయన తెలిపారు. అప్కమింగ్ మ్యాచుల్లోనూ ఇదే స్థాయి వీక్షణలతో కొత్త రికార్డులు నమోదవుతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ మేరకు జై షా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
'ప్రస్తుత టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీని అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఈవెంట్గా మార్చాలనే ఆశయంతో ప్రారంభించాం. భారత్లో ఈ టోర్నీని ఇప్పటికే 50 కోట్ల మంది వీక్షించారు. ఇది టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధికం. జియో హాట్ స్టార్ వీక్షకుల సంఖ్య 6.05 కోట్లకు చేరుకుంది. ఈ రాత్రి నుంచి నాకౌట్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. వీటిని భారత అభిమానులు భారీ సంఖ్యలో వీక్షించి, మరిన్ని రికార్డులు బద్దలు కొట్టాలని ఆశిస్తున్నాం.'అని ఆయన పేర్కొన్నారు.

నేటి(బుధవారం) రాత్రి 7 గంటలకు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య సెమీఫైనల్-1 మ్యాచ్ జరగనుంది. అలాగే రేపు(గురువారం) ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా గురువారం భారత్, ఇంగ్లండ్ సెమీఫైనల్స్-2లో తలపడనున్నాయి. ఈ మ్యాచుల్లో గెలిచిన జట్లు ఫైనల్కు చేరుకుంటాయి.
ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఒకవేళ భారత్ ఫైనల్ చేరితే వీక్షకుల సంఖ్య డబుల్ కానుంది. మొత్తానికి ఈ మెగా టోర్నీతో అటు బ్రాడ్కాస్టర్స్.. ఇటు ఐసీసీ, బీసీసీఐల పంట పండింది. అసాధారణ ప్రదర్శనతో వెస్టిండీస్ను మట్టికరిపించిన భారత్.. సెమీఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించి ఫైనల్ చేరాలనుకుంటుంది. ఇప్పటికే ఇరు జట్లు ముంబై చేరి ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. వెస్టిండీస్తో మ్యాచ్లో సంజూ శాంసన్ అసాధారణ బ్యాటింగ్తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.