ఆస్ట్రేలియాపై ఆగ్రహంగా..
ఇక ఆ టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగన సెమీఫైనల్లో అయితే శ్రీశాంత్ చాలా దూకుడుగా వ్యవహరించాడు. ఆ మ్యాచ్లో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లతో భారత్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే నాటి సెమీఫైనల్ మ్యాచ్లో తాను ఆగ్రహంగా ఉండటానికి గల కారణాన్ని ఈ కేరళ పేసర్ తాజాగా వెల్లడించాడు. 2003 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమిని చూసి ఆ జట్టుపై కసిని పెంచుకున్నానని తెలిపాడు.
ఇక ఆ టోర్నీ ఆద్యాంతం అదరగొట్టిన సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని భారత్.. ఆస్ట్రేలియా చేతిలో రెండు సార్లు ఓటమిపాలైంది. లీగ్ స్టేజ్లో 125 పరుగులకే ఆలౌట్ అయిన గంగూలీ సేన 8 వికెట్లతో పరాజయం చవిచూసింది. ఇక టైటిల్ ఫైట్లో 359 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక అదే 125 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.
చంపేయాలనేం కసి పెరిగింది..
ఈ రెండు పరాజయాలు తన మనస్సులో నాటుకుపోయాయని, అవకాశం దొరికితే వారిని చంపేయాలనంత కసిని పెంచుకున్నానని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. ‘యార్కర్ వేయాలని భావించిన నా తొలి బంతిని మాథ్యూ హెడెన్ ఫోర్ కొట్టడం నాకింకా గుర్తుంది. ఆ మ్యాచ్ను మీరు చూసినట్లయితే.. నేను చాలా ప్యాషన్తో పరుగు తీయడం కనిపిస్తుంది. ఎలాగైన ఆస్ట్రేలియాను ఓడించాలనుకున్నాను. 2003 ప్రపంచకప్లో వారు భారత్ను ఓడించిన విధంగా చిత్తు చేయాలనుకున్నాను. ఆ ఓటమి ఎప్పటికీ నా మనస్సులో ఉంటుంది. వారిని చంపేయాలనంత కసిని పెంచింది.'అని కౌ కార్నర్ క్రోనికల్స్ షోలో పాల్గొన్న శ్రీశాంత్ తెలిపాడు.
ఖబర్దార్ అఫ్రిది.. ఇది సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన మోదీ ప్రభుత్వం
అది నా కెరీర్ బెస్ట్..
ఇక ఆసీస్తో జరిగిన నాటి సెమీఫైనల్లో శ్రీశాంత్ ప్రదర్శన అతని కెరీర్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఇప్పటికీ శ్రీశాంత్ అనగానే చాలా మంది అభిమానులకు ఈ మ్యాచే గుర్తుకొస్తుంది. ముఖ్యంగా క్షిష్ట పరిస్థితుల్లో హెడెన్ ఔట్ చేసిన విధానం.. అతని ఔట్ అనంతరం శ్రీశాంత్ చేసుకున్న సంబరాల తీరు ఎవరూ అంత సులువుగా మర్చిపోరు. అయితే ఈ మ్యాచ్లో తనను భాగం చేసినందరకు ఆ దేవుడికి కృతజ్ఞుడిగా ఉంటానని శ్రీశాంత్ తెలిపాడు.
‘ఆస్ట్రేలియా ఆటగాళ్లతో నేనెప్పుడూ చాలా కోపంగా ఉండేవాడిని. ప్రతీ ఒక్కరు మాట్లాడుకునే మ్యాచ్లో నన్ను భాగస్వామ్యం చేసిన ఆ దేవుడికి నేనెప్పుడు కృతజ్ఞుడిగా ఉంటాను. చాలా గర్వపడుతున్నా కూడా. నా దేశం తరపున నేను కనబర్చిన అత్యుత్తమ ప్రదర్శన అదే. ఆ మ్యాచ్లో నేను చాలా డాట్ బాల్స్ వేసాను. కేవలం రెండే ఫోర్లు ఇచ్చానని నాకింకా గర్తుంది. మొత్తంగా 12 పరుగులు మాత్రమే సమర్పించుకున్నా.'అని 37 ఏళ్ల శ్రీశాంత్ గుర్తు చేసుకున్నాడు.
రీ ఎంట్రీ కోసం..
ఈ ఏడాది సెప్టెంబర్తో తనపై బీసీసీఐ విధించిన ఏడేళ్ల నిషేధం తొలిగిపోనుండటంతో శ్రీశాంత్ పునరాగమనం కోసం చూస్తున్నాడు. ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీశాంత్పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన విషయం తెలిసిందే. రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తూ స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడ్డారన్న అభియోగాలపై శ్రీశాంత్పై బోర్డు చర్యలు తీసుకుంది. అయితే దీనిపై కోర్టులకెళ్లి సుదీర్ఘ పోరాటం చేసిన ఈ కేరళ పేసర్.. పలుమార్లు తనకు అనుకూలంగా తీర్పులు తెచ్చుకున్నా బీసీసీఐ మాత్రం ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కానీ గతేడాది శ్రీశాంత్పై విధించిన జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్మన్ డీకే జైన్ ఆదేశాలిచ్చారు. దాంతో అతనిపై ఏడేళ్ల నిషేధ కాలం ఈ సెప్టెంబర్తో పూర్తి కానుంది.