|
యువీ, పఠాన్ దంచికొట్టడంతో..
ఈ మ్యాచ్ విషయానికొస్తే ఇంగ్లాండ్ లెజెండ్స్ టాస్ గెలిచిన తర్వాత మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఇండియా లెజెండ్స్ ఓపెనర్లు నమన్ ఓజా, సచిన్ టెండూల్కర్ ఇద్దరు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడుతూ స్కోరుబోర్డును నడిపించారు. ఆరో ఓవర్లో నమన్ ఓజా (20) ఔటయ్యేసరికి స్కోరు 65కు చేరుకుంది. ఇక సచిన్ సైతం 2పరుగుల వ్యవధిలోనే ఔటయ్యాడు. ఇక రైనా (12) తొందరగొనే ఔటయినా.. యూసుఫ్ పఠాన్ (11బంతుల్లో 27పరుగులు 1ఫోర్, 3సిక్సర్లు), యువరాజ్ సింగ్ (15బంతుల్లో 31పరుగులు 1ఫోర్, 3సిక్సులు నాటౌట్), స్టువర్ట్ బిన్నీ (18), ఇర్ఫాన్ పఠాన్ (11) దంచికొట్టడంతో స్కోరు బోర్డు 195కు చేరుకుంది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా 15ఓవర్లకు కుదించారు. 15ఓవర్లలోనే భారత్ 170పరుగులు చేయడం గమనార్హం.
|
బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన ఇంగ్లాండ్ లెజెండ్స్
ఛేదనలో ఇంగ్లాండ్ లెజెండ్స్ ఓపెనర్లు ఫిల్ మస్టర్డ్, డిమిత్రి మస్కరెన్హాస్ పవర్ప్లేలో కాస్త ధాటిగా ఆడడంతో శుభారంభం దక్కింది. మస్టర్డ్ (19 బంతుల్లో 29 పరుగులు) రాణించాడు. అయితే 36పరుగులకు తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఇయాన్ బెల్, రిక్కీ క్లార్క్, టిమ్ ఆంబ్రోస్ లాంటి దిగ్గజాలు తమ అంచనాలను అందుకోలేక పోవడంతో 85పరుగులకే 6వికెట్లు కోల్పోయింది. చివర్లో స్కోఫీల్డ్ 19పరుగులు, ట్రెమ్లెట్ 24పరుగులు పర్వాలేదనిపించేలా ఆడి స్టేడియంలోని అభిమానులకు కొంత వినోదాన్ని అందించింది. చివరికి 40 పరుగుల తేడాతో ఇండియా లెజెండ్స్కు ఘన విజయం దక్కింది. భారత బౌలర్లలో రాజేష్ పవర్ 3, మన్ ప్రీత్ గోనీ 1, బిన్నీ 1, ప్రగ్నాన్ ఓజా 1 వికెట్ తీశారు.
|
గతాన్ని గుర్తుకుతెచ్చిన యువీ, సచిన్
ఇక ఈ మ్యాచ్ చూసినవారిని అలనాటి సచిన్ గుర్తుకొచ్చే ఉంటాడు. 1998లో ఆసీస్ మీద ఓ మ్యాచ్లో సచిన్ చెలరేగి ఆడాడు. ఆ మ్యాచ్లో కొట్టిన సిక్సర్.. మళ్లీ నిన్నటి మ్యాచ్లో సచిన్ కొట్టాడు. మూడు వైవిధ్యమైన సిక్సులు, ప్లేస్ మెంట్ ఫోర్లు చూస్తే.. సగటు సచిన్ అభిమాని ఎంత పులకించిపోయి ఉంటాడో చెప్పలేం. ఇక మరో పక్క యువీ కూడా తన భీకర స్ట్రోక్ చూపించాడు. యువీ కొట్టిన తొలి సిక్స్.. ఒకప్పటి యువరాజ్ను గుర్తుకుతెచ్చింది. ఇక మరో రెండు సిక్సులు కూడా అదిరిపోయాయి. అలాగే యూసుఫ్ పఠాన్ కూడా తన హిట్ ప్యాక్డ్ ఇన్నింగ్స్ చూపించాడు. అతను కూడా మూడు భారీ సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్ చూడలేకపోయామని బాదపడొద్దు. హైలెట్స్ వూట్ (VOOT) యాప్లో చూడండి.