ఇండియా స్ట్రీట్ సూపర్ లీగ్ 2024 టోర్నీ ఆరంభ వేడుకల్లో టాలీవుడ్ స్టార్ హీరో రామ్చరణ్తో కలిసి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ 'నాటు నాటు' స్టెప్పులేసాడు. సచిన్తో పాటు సూర్య, అక్షయ్ కుమార్ కూడా కాలు కదిపారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
టెన్నిస్ బాల్తో జరిగే ఈ టీ10 క్రికెట్ లీగ్లోభారత స్టార్ హీరోలంతా భాగమయ్యారు. మహారాష్ట్రలోని దాదోజీ కొండదేవ్ స్టేడియం వేదికగా ఈ అరంగేట్ర సీజన్కు తెరలేచింది. ఈ టోర్నీ ఆరంభ వేడుకలకు సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

మార్చి 15 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు తలపడుతున్నాయి. మాజీ ముంబై, శ్రీనగర్ కే వీర్, ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సింగమ్స్, బెంగళూరు స్ట్రైకర్స్, టైగర్స్ ఆఫ్ కోల్కతా జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కొనుగోలు చేయగా.. మాజీ ముంబై ఫ్రాంచైజీని అమితాబ్ బచ్చన్, చెన్నై సింగమ్స్ను సూర్య శివకుమార్, బెంగళూరు స్ట్రైకర్స్ హృతిక్ రోషన్, టైగర్స్ ఆఫ్ కోల్కతా జట్టును సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్లు కొనుగోలు చేశారు.
ఈ టీ10 క్రికెట్ టోర్నీ మ్యాచ్లు సోనీ స్పోర్ట్స్, సోనీ లైవ్ యాప్లో ప్రత్యక్షప్రసారం కానున్నాయి. ఈ టోర్నీకి టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి చీఫ్ మెంటార్గా వ్యవహరిస్తున్నారు. మాజీ క్రికెటర్లు ప్రవీణ్ ఆమ్రె, జతిన్ పరాంజపేలు సెలెక్షన్ కమిటీ మెంబర్స్గా ఉన్నారు.
తొలి మ్యాచ్లో శ్రీనగర్ కే వీర్ వర్సెస్ మాజీ ముంబై జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే టెన్నిస్ బాల్ క్రికెట్లో అసాధారణ ప్రతిభ కలిగిన ఆటగాళ్లను ఆయా జట్లలోకి ఎంపిక చేశారు.