టీమిండియా దిగ్గజ క్రికెటర్, పంజాబ్ మాజీ మంత్రి నవ్జ్యోత్ సింగ్ సిద్ధు మళ్లీ కామెంట్రీ మైక్ పట్టుకునేందుకు సిద్దమయ్యాడు. అప్కమింగ్ ఐపీఎల్ 2024 సీజన్లో తన వ్యాఖ్యానంతో అభిమానులను అలరించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత కామెంటేటర్గా.. టీవీ హోస్ట్గా అలరించిన నవ్జ్యోత్ సింగ్ సిద్ధు.. ఈ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టి పంజాబ్ మంత్రిగా పని చేశాడు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ పంజాబ్లో అధికారం కోల్పోవడంతో ఖాళీగా ఉన్న నవ్జ్యోత్ సింగ్ సిద్ధు మళ్లీ కామెంట్రీ చెప్పేందుకు రెడీ అయ్యాడు. ఈ నేపథ్యంలో సిద్ధు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తన ఫస్ట్ లవ్ క్రికెట్ అని చెప్పిన సిద్ధు.. గ్యాప్ వచ్చినా తన కామెంట్రీలో ఏ మాత్రం పదును తగ్గదని తెలిపాడు.

రోజుకు రూ. 25 లక్షలు..
తన క్రికెట్ కెరీర్లో ఎన్నో ఒడిదొడుకుల మధ్య 20 సార్లు టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చినా.. కామెంటేటర్గా మాత్రం ఇదే తొలి రీఎంట్రీ అని స్పష్టం చేశాడు. గతంలో ఐపీఎల్ వంటి ప్రధాన టోర్నీలకు కామెంటేటర్గా రూ. 60-70 లక్షలు పారితోషకంగా తీసుకునేవాడినని, ప్రస్తుతం రోజు రూ. 25 లక్షలు మాత్రమే తీసుకుంటున్నానని చెప్పాడు. డబ్బుల కంటే తనకు నచ్చిన ఆటను ఆస్వాదిస్తూ కామెంట్రీ చెప్పడం సరదాగా ఉంటుందని చెప్పాడు.
భారత క్రికెట్ టీమ్ గురించి మాట్లాడుతూ.. కోహ్లీ, రోహిత్ శర్మలపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ ఇద్దరూ భారత క్రికెట్ దిగ్గజాలని, ఫామ్తో సంబంధం లేకుండా టీ20 ప్రపంచకప్ ఆడించాలని సూచించాడు. 'కోహ్లీ, రోహిత్ ఇద్దరూ టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండాలి. ఈ ఇద్దరూ వరల్డ్ క్రికెట్కు సూపర్ స్టార్స్.
గ్రేటెస్ట్ ఇండియా బ్యాటర్..
ఫామ్ అనేది ఉదయం వచ్చే తేమలాంటిది. అది ఎప్పుడైనా పోవచ్చు. కానీ కోహ్లీ, రోహిత్ల క్లాస్ అధికారిక ముద్రలాంటిది. ఎప్పటికీ చెరుగదు. నేను విరాట్ కోహ్లీని గ్రేటెస్ట్ ఇండియన్ బ్యాట్స్మన్గా భావిస్తాను. ఎందుకంటే అతని ఫిట్నెస్ ప్రధాన కారణం. పాత వైన్లా వయసు పెరుగుతున్నా కొద్ది కోహ్లీ మరింత ఫిట్ అవుతున్నాడు.
సాంకేతిక పరంగాను అతను అద్భుతం. మూడు ఫార్మాట్లకు అనుగుణంగా ఆడే అసాధారణ నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడు. రోహిత్ శర్మకు కూడా ఈ మాటలు వర్తిస్తాయి.'అని సిద్ధు చెప్పుకొచ్చాడు. సచిన్ టెండూల్కర్తో కలిసి ఎన్నో మ్యాచ్లు ఆడిన సిద్ధు.. విరాట్ కోహ్లీని అత్యుత్తమ భారత బ్యాటర్గా పేర్కొనడం గమనార్హం.