ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు వెనుక ఆ జట్టు మెంటార్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సచిన్ టెండూల్కర్ సూచనలతోనే ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది.
ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ క్యాష్ ట్రేడ్ డీలింగ్ ద్వారా జట్టులోకి తెచ్చుకుంది. ఆ వెంటనే అతనికి సారథ్య బాధ్యతలను అప్పగించింది. ముంబై ఇండియన్స్ భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది.

రెండు గ్రూప్లుగా..
అయితే కెప్టెన్సీ మార్పు నిర్ణయంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ అభిమానులు కెప్టెన్సీ మార్పును జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా ఖాతాలను లక్షల మంది అన్ఫాలో చేశారు. కనీసం ఈ సీజన్ వరకు అయినా రోహిత్ను కెప్టెన్గా కొనసాగించాల్సిందని అభిప్రాయపడ్డారు.
అభిమానులే కాకుండా జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ వంటి సీనియర్ ఆటగాళ్లు సైతం కెప్టెన్సీ మార్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే జట్టు రెండు వర్గాలుగా ఛీలిపోయిందనే వాదన బలంగా వినిపిస్తోంది. హార్దిక్ పాండ్యా చేసిన వ్యాఖ్యలు కూడా ఈ వాదనకు బలం చేకూర్చుతోంది. కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రోహిత్ శర్మతో తాను మాట్లాడలేదని చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
సచిన్ కుట్ర..
కెప్టెన్ మార్పు వెనుక సచిన్ కుట్ర ఉందని రోహిత్ శర్మ అభిమానులు ఆరోపిస్తున్నారు. కొడుకు అర్జున్ టెండూల్కర్ కోసం సచిన్ ఈ కుట్ర చేశాడని వాదిస్తున్నారు. రోహిత్ శర్మ సారథ్యంలో అర్జున్ టెండూల్కర్కు పెద్దగా అవకాశాలు ఇవ్వలేదని, అతనిపై సచిన్ కక్ష పెంచుకున్నాడని చెబుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో రోహిత్ శర్మను అర్జున్ టెండూల్కర్ ఫాలో కాకపోవడం.. హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్లను మాత్రమే ఫాలో అవుతుండటంతో ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
అంతేకాకుండా అందరి బర్త్డేలకు ఎక్స్ వేదికగా విషెస్ తెలిపిన సచిన్.. రోహిత్కు మాత్రం ఎలాంటి విషెస్ తెలియజేయలేదని, కొంతకాలంగా అతనిపై ఆగ్రహంగా ఉన్నాడని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్ 2024 సీజన్లో అర్జున్ టెండూల్కర్కు నాలుగు కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడితే.. ఈ వాదన సరైనదని నమ్మవచ్చని అభిప్రాయపడుతున్నారు.
మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుండగా.. 24న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగే మ్యాచ్తో ముంబై ఇండియన్స్ తమ క్యాంపైన్ను ప్రారంభించనుంది.