2007 వన్డే ప్రపంచకప్లో టీమిండియా పేలవ ప్రదర్శన చేసింది. గ్రూప్ స్టేజ్లోనే ఇంటిముఖం పట్టింది. బంగ్లాదేశ్, శ్రీలంక చేతిలో ఘోరపరాజయన్ని చవిచూసింది. భారత క్రికెటర్లపై, బీసీసీఐపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కొన్ని నెలలకే టీ20 ప్రపంచకప్. బీసీసీఐ కాస్త వినూత్నంగా ఆలోచించింది. ఈ పొట్టిఫార్మాట్ వరల్డ్ కప్కు సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి ఎంఎస్ ధోనీ సారథ్యంలో జట్టును ఎంపికచేసింది.
ఈ ప్రయోగం సూపర్ హిట్ అయ్యింది. అండర్డాగ్స్లో బరిలోకి దిగి భారత్ టీ20 వరల్డ్ కప్ను ముద్దాడింది. ఆ తర్వాత ధోనీ జైత్రయాత్ర మొదలైంది. కొన్నాళ్లకే టీమిండియా కెప్టెన్సీ పూర్తి బాధ్యతలు అందుకున్నాడు. ధోనీ సారథ్యంలో టీ20 ప్రపంచకప్తో పాటు 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలిచింది. ఇక ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ధోనీ అయిదు టైటిళ్లు అందించాడు.

అత్యుత్తమ సారథుల్లో ఒకరిగా ధోనీ చరిత్రకెక్కాడు. అయితే ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభానికి ఒక్క రోజు ముందు ధోనీ తన అభిమానులకు షాకిచ్చాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. సీఎస్కేకు తన వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేశాడు. ఈ నేపథ్యంలో ధోనీ కెప్టెన్సీ గురించి సచిన్ టెండూల్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అసలు టీమిండియా కెప్టెన్గా ధోనీ ఎంపిక కావడానికి తాను ఓ కారణమని సచిన్ వెల్లడించాడు.
''2007లో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు నన్ను తీసుకోమని అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శరద్ పవార్ కోరారు. అప్పుడు ఆయనతో ఇలా చెప్పాను. 'నా శరీరం అంత గొప్ప స్థితిలో లేదు. ఓ కెప్టెన్ ప్రతిసారి డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లి తన చీలమండకు పట్టీలు వేసుకోవడం, తన భుజానికి చికిత్స తీసుకోవడం చేస్తూ ఉంటే బాగుండదు. అది జట్టుకే మంచిది కాదు' అని అన్నాను. ధోనీని కెప్టెన్ చేయమని సలహా ఇచ్చాను''
''ధోనీ గురించి నాకు బాగా తెలుసు. స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ధోనీతో మైదానంలో మాట్లాడుతుండేవాడిని. ఈ స్థితిలో నువ్వు ఏం చేసేవాడివని ధోనీని ప్రశ్నిస్తుండేవాడిని. దానికి ధోనీ గొప్పగా బదులిచ్చేవాడు. బ్యాలెన్సింగ్ ఆన్సర్స్ చెప్పేవాడు. అతడి ఆలోచనలు సహజసిద్ధంగా ఉంటాయి. ఆటలో ప్రతి క్షణం గురించి ధోనీకి ఎంతో అవగాహన ఉంది'' అని సచిన్ పేర్కొన్నాడు.