సరిగ్గా 21 ఏళ్ల క్రితం ఇదే రోజు(2003 మార్చి 1న) క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ విధ్వంసకర బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. దాయాదీ పాకిస్థాన్పై సునామీ ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. వన్డేలు, టెస్ట్లతో సంప్రదాయక బ్యాటింగ్కు అలవాటు పడిన అభిమానులకు టీ20 తరహా హిట్టింగ్ను రుచి చూపించాడు.
అది కూడా 2003 వన్డే ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో ఆకాశమే హద్దుగా చెలరేగి పట్టపగలే పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సచిన్ ఆడిన ఆ భయానక ఇన్నింగ్స్ పాకిస్థాన్కు పీడకలగా మిగిలిపోయింది.

వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్, అబ్దుల్ రజాక్, షాహిద్ అఫ్రిది వంటి వలర్డ్ క్లాస్ బౌలర్లపై సచిన్ విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడటంతో ఈ ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోయింది. భారత అభిమానులకు ప్రత్యేక రోజుగా మిగిలిపోయింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 273 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ జట్టు ఓపెనర్ సయీద్ అన్వర్ (101) సెంచరీతో చెలరేగాడు. మిగతా వారిలో యూనిస్ ఖాన్ (32), రషీద్ లతీఫ్ (29 నాటౌట్), మహ్మద్ యూసుఫ్ (25), తౌఫీక్ ఉమర్ (22) రాణించారు. భారత బౌలర్లలో జహీర్ ఖాన్, అశిష్ నెహ్రా రెండేసి వికెట్లు తీయగా.. దినేష్ మోంగియా, జవగళ్ శ్రీనాథ్ తలో వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన టీమిండియాకు ఓపెనర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు ధాటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించారు. ఆరంభం నుంచే వరుస బౌండరీలతో పాకిస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో 34 బంతుల్లోనే 53 పరుగులు జోడించిన తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ (21) ఔటయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ గంగూలీ డకౌట్ అయినప్పటికీ, మహ్మద్ కైఫ్తో కలిసి సచిన్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. అప్పటికీ ప్రపంచంలోనే భీకరమైన బౌలర్లుగా పేరు గాంచిన వసీం అక్రమ్, షోయబ్ అక్తర్, యూనిస్ ఖాన్ల బౌలింగ్ను సచిన్ టెండూల్కర్ ఊచకోత కోశాడు. వారి బౌలింగ్ను సునాయసంగా ఎదుర్కొంటూ ధారాళంగా పరుగులు రాబట్టాడు.
దాంతో సచిన్కు ఎక్కడ బంతులు వేయాలో తెలియక పాక్ బౌలర్లు తలపట్టుకున్నారు. అయితే సెంచరీ ఖాయమనుకున్నసమయంలో 75 బంతుల్లోనే 98 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సచిన్ ఔటయ్యాడు. కానీ అప్పటికే భారత్ను సచిన్ విజయం వైపు తీసుకెళ్లాడు. 130 స్ట్రైక్రేట్తో బ్యాటింగ్ చేసిన సచిన్ ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, ఒక సిక్సు ఉన్నాయి. సచిన్ ఆడిన ఈ ఇన్నింగ్స్ అతని గొప్ప ఇన్నింగ్స్లలో ఒకటిగా నిలిచిపోయింది.
సచిన్ ఔటయ్యాక యువరాజ్ సింగ్ (50 నాటౌట్), రాహుల్ ద్రావిడ్ (44 నాటౌట్) భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశారు. మహ్మద్ కైఫ్ కూడా 35 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా మరో 26 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుని సెమీ ఫైనల్ చేరింది. సచిన్ టెండూల్కర్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సెమీఫైనల్లో కూడా గెలిచి ఫైనల్ చేరిన టీమిండియా తుది పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రనరప్గా నిలిచింది.