KKR vs RCB: ఐపీఎల్ 2024 సీజన్ అంచనాలకు అందట్లేదు. అనూహ్యంగా భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. 50- ఓవర్ల ఫార్మట్ తరహాలో మ్యాచ్లు సాగుతున్నాయి. ప్రత్యేకించి.. సన్రైజర్స్ హైదరాబాద్. ఈ జట్టు ఆటతీరుకు హద్దులు ఉండట్లేదు. టీ20 గేమ్లో ఉండే హద్దులన్నింటినీ చెరిపేసింది. ఈ జట్టు 250కి పైగా స్కోర్ను నమోదు చేస్తోందంటే నమ్మశక్యం కావట్లేదు క్రికెట్ పండితులకు.
శనివారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఢిల్లీ కేపిటల్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఏ స్థాయిలో రెచ్చిపోయిందో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. చివరి రెండు మ్యాచ్లను రిపీట్ చూపించింది. ఆ రెండు మ్యాచ్ల హైలైట్స్ను చూస్తోన్నామనే ఫీలింగ్ను కలిగించింది.

టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లల్లో 266 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్- 32 బంతుల్లో 69, అభిషేక్ శర్మ- 12 బంతుల్లో 46 పరుగులు చేశారు. మిడిలార్డర్లో నితీష్ కుమార్ రెడ్డి- 27 బంతుల్లో 37, షాబాజ్ అహ్మద్- 29 బంతుల్లో 59 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
అనంతరం బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ కేపిటల్స్- ఈ స్కోర్ను అందుకోలేకపోయింది. 199 పరుగుల వద్దే దాని ప్రస్థానం నిలిచిపోయింది. 19.1 ఓవర్లల్లో ఆలౌట్ అయిందా జట్టు. క్రీజ్లో ఉన్నది కొద్దిసేపే అయినా ఫస్ట్ డౌన్ బ్యాటర్ జేక్ ఫ్రేజర్- మెక్గుర్క్ పిడుగులు కురిపించాడు స్టేడియంలో. 18 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఫాస్టెస్ట్ 50ని రికార్డ్ చేశాడీ యంగ్ బ్యాటర్.
ఒకే ఐపీఎల్ సీజన్లో మూడుసార్లు 260కి పైగా స్కోర్ చేయగలిగింది సన్రైజర్స్ హైదరాబాద్. అంతకుముందు ముంబై ఇండియన్స్పై 277, ఆ తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 287 పరుగులు చేసింది. ఇప్పుడు తాజాగా ఢిల్లీ కేపిటల్స్పై 267 పరుగులను స్కోర్ బోర్డుపై జమ చేసింది.
సన్రైజర్స్ హైదరాబాద్ ఈ రేంజ్లో ఆడుతోండటం సచిన్ టెండుల్కర్ను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఒకే ఐపీఎల్ సీజన్లో మూడుసార్లు 260కి పైగా పరుగులు చేయడం అసాధ్యమైన విషయమని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్ఆర్హెచ్లో ఏం జరుగుతోందంటూ ట్వీట్ పోస్ట్ చేశారు.
ఓపెనర్లు ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు సచిన్ టెండుల్కర్. మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్ ఆడారంటూ ప్రశంసించారు. చివర్లో షాబాజ్ అహ్మద్ అద్భుతంగా మ్యాచ్ను ఫినిష్ చేశాడని చెప్పుకొచ్చారు. బ్యాటింగ్లో మాత్రమే కాకుండా బౌలింగ్లోనూ సత్తా చాటారని, ఢిల్లీ కేపిటల్స్ కంటే చాలా బెటర్గా బంతులను సంధించారని అన్నారు.
ఢిల్లీ కేపిటల్స్ ఇన్నింగ్ కూడా ఏమాత్రం తీసిపారేయలేమని వ్యాఖ్యానించారు. భారీ స్కోర్ నమోదైన ఈ మ్యాచ్లో ఢిల్లీ కేపిటల్స్ అవుట్ క్లాస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని సచిన్ టెండుల్కర్ పేర్కొన్నారు.