సచిన్ రమేశ్ టెండూల్కర్.. అతను సాధించిన ఘనతలు చెప్పుకుంటూ పోతే ఓ రోజు సరిపోదంటే అతియోశక్తి కాదు! 24 ఏళ్ల తన సుదీర్ఘ క్రికెట్లో ఎన్నో వేల పరుగులు, లెక్కకట్టలేని రికార్డులు, క్రికెట్ చరిత్రలో తన పేరిట వందల పేజీలు. అతని ఆట కోసమే మైదానానికి వచ్చేవాళ్లు, టీవీలకు అతుక్కపోయేవాళ్లు అనంతం. 16 ఏళ్ల వయసులోనే రికార్డుల వేట మొదలుపెట్టి శతక శతకాలు సాధించిన యోధుడు. ఇవాళ ఈ క్రికెట్ గాడ్ హ్యాపీ బర్త్డే (51). ఈ 'స్పెషల్ డే'న సచిన్ స్పెషల్ ఇన్నింగ్స్లు ఓసారి గుర్తు చేసుకుందాం!!
అంచనాలు లేకుండా అరంగ్రేటం చేసిన సచిన్ క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనాలు సృష్టించాడు. ఎన్నో ప్రపంచ రికార్డులను తన పేరుతో తిరగరాసుకున్నాడు. సచిన్ అంటే రికార్డులు.. రికార్డులు అంటే సచిన్ అనే రీతిలో చెలరేగిపోయాడు. అయితే క్రికెట్ ప్రపంచమంతా అతనివైపు ఆసక్తిగా ఎదురుచూసింది మాత్రం 1992 ఫిబ్రవరిలో.
ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్లో అప్పటి 19 ఏళ్ల సచిన్ వెన్నుచూపని వీరత్వంతో అసాధారణ పోరాటం చేశాడు. ఆసీస్ భీకర బౌలర్లను ఎదుర్కొంటూ 114 పరుగులు చేసి తొమ్మిదో వికెట్గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్లో భారత్ పరాజయాన్ని చవిచూసినా తానేంటో సచిన్ క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పాడు.

వెన్నునొప్పిని భరిస్తూ..
1999 జనవరిలో చెపాక్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన టెస్టులో భారత్ 12 పరుగుల స్వల్ప తేడాతో ఓడింది. కానీ ఈ మ్యాచ్లో సచిన్ ఇన్నింగ్స్ అద్భుతం. తొలి ఇన్నింగ్స్లో పాక్ 238, టీమిండియా 254 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో పాకిస్థాన్ 286 పరుగులు చేసి భారత్కు 271 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. కానీ భారత్ 82/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ, సచిన్ (136).. మోంగియా(52)తో కలిసి పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ జట్టును గెలుపు దిశగా నడిపించాడు. వెన్నునొప్పితో బాధపడుతూనే శతకం సాధించాడు. అయితే 254 పరుగుల వద్ద సచిన్ ఏడో వికెట్గా ఔటవ్వడంతో భారత్ ఓటమి చవిచూసింది.
కన్నీళ్లను ఆపుకుంటూ..
1999 ప్రపంచకప్లో కెన్యాపై సాధించిన శతకం ప్రత్యేకమైనది. తండ్రిని కోల్పోయిన బాధను దిగమింగి కెన్యాపై శతకం బాది జట్టును గెలిపించాడు. జీవితంలో కష్టమైన దశలో అతడు ఆడిన మెరుపు ఇన్నింగ్స్కు ప్రశంసలు వెల్లువెత్తాయి. 101 బంతుల్లో సచిన్ అజేయంగా 140 పరుగులు సాధించాడు. 16 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. దీంతో భారత్ 329/2 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన కెన్యా 235 పరుగులే చేసింది.
అక్తర్కు చుక్కలు.
2003 ప్రపంచకప్లో పాక్పై సచిన్ విధ్వంసకర ఇన్నింగ్స్తో భారత్ను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 273 పరుగులు చేసింది. అనంతరం సచిన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 75 బంతుల్లో 98 పరుగులు బాదాడు. 12 ఫోర్లు ,ఒక సిక్సర్ సాధించాడు. షోయబ్ అక్తర్ వేసిన షార్ట్బాల్ను సచిన్ డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా సిక్సర్ బాదిన తీరు అమోఘం. ఈ మ్యాచ్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
147 బంతుల్లో డబుల్ సెంచరీ
2010 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాపై సచిన్ చేసిన ద్విశతకం క్రికెట్ ప్రపంచాన్నే ఊపేసింది. అయితే ఈ ఇన్నింగ్స్ ఉత్కంఠగా సాగింది. 45వ ఓవర్లోనే సచిన్ 190 పరుగులు చేసినప్పటికీ తర్వాత అతడికి ఎక్కువ స్ట్రైకింగ్ లభించలేదు. దీంతో డబుల్ సెంచరీ సాధిస్తాడో లేదోనని అభిమానుల్లో ఆందోళన నెలకొంది. కాగా, ఆఖరి ఓవర్లో మూడో బంతిని బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా సింగిల్ తీసి సచిన్ ద్విశతకాన్ని పూర్తిచేసుకున్నాడు.