న్యూఢిల్లీ: న్యూజిలాండ్తో తొలి వన్డేలో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ లేకపోవడమేనని మాజీ సెలెక్టర్ సబా కరీం అన్నాడు. మిగతా జట్లన్నీ 6-7 బౌలింగ్ ఆప్షన్స్తో బరిలోకి దిగుతుంటే టీమిండియా ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగడం ఏంటో తనకు అర్థం కావడం లేదన్నాడు. ఎక్స్ట్రా బ్యాటర్కు బదులు టీ20ల్లో రాణించిన దీపక్ హుడాను ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించాడు. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో కివీస్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. 307 పరుగుల భారీ లక్ష్యాన్ని బౌలింగ్ వైఫల్యంతో గబ్బర్ సేన కాపాడుకోలేపోయింది. ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ ఉంటే ఈ మ్యాచ్లో భారత్ గెలిచేదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డాడు.
ఈ క్రమంలోనే టీమ్మేనేజ్మెంట్ నిర్ణయాన్ని సబా కరీం తప్పుబట్టాడు.'అదనంగా ఎందుకు బ్యాటర్ను తీసుకొందో నాకైతే అర్థం కాలేదు. అయితే దీపక్ హుడాను తీసుకొని ఉంటే బ్యాటింగ్తోపాటు బౌలింగ్లోనూ ఉపయోగపడేవాడు. మరోవైపు ఆరో బౌలర్ లేకుండా భారత్ బరిలోకి దిగింది. తప్పకుండా ఆరో బౌలర్ ఆప్షన్ ఉండాల్సిందే. ఇటీవల కేవలం ఐదుగురు బౌలర్లతోనే ఆడటం గమనించా. ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. అదనంగా మరొక బ్యాటర్ను తీసుకొనే బదులు దీపక్ హుడాకు అవకాశం ఇస్తే బాగుండేది.
సెలెక్టర్లు చాలా మంది బ్యాటర్లతో కూడిన జట్టునే ప్రకటిస్తున్నారు. మరి ఆల్రౌండర్లు ఎక్కడ? ఒకరి బదులు మరొక ఆల్రౌండర్ను రీప్లేస్ చేసే అవకాశం ఉందా..? సెలెక్షన్ కమిటీ సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే స్పిన్నర్లూ ఇబ్బంది పడ్డారు. ప్రత్యర్థి బ్యాటర్లు స్వీప్, రివర్స్ స్వీప్ ఆడినప్పుడు మన స్పిన్ బౌలర్లు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి బ్యాటర్లను ఎదుర్కొనేలా మన బౌలర్లను ఎందుకు సన్నద్ధత చేయడం లేదు? కనీసం ఫీల్డింగ్నైనా మార్చుకోగలిగాలి. లేకపోతే భవిష్యత్తులోనూ ఇలానే ఇబ్బంది పడాల్సి ఉంటుంది'అని సబా కరీం హెచ్చరించాడు.