ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 తుది ఘట్టానికి చేరుకుంది. మార్చి 8న అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరగనున్న ఈ మహా సంగ్రామంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే గత కొన్ని రోజులుగా టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఐపీఎల్లో విధ్వంసకర ఇన్నింగ్స్లతో వెలుగులోకి వచ్చిన ఈ యువ కెరటం.. ప్రపంచకప్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరో ప్లేయర్కు అవకాశం!
ప్రపంచ కప్ టోర్నీలో అభిషేక్ ప్రదర్శన గణాంకాలు అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. టోర్నీ ఆరంభం నుంచి వరుసగా మూడు సార్లు డకౌట్ అవ్వడం అభిషేక్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఒకే ఒక్క అర్ధ సెంచరీ మినహాయిస్తే.. మిగతా మ్యాచ్ల్లో అతను రెండంకెల స్కోరు కూడా దాటలేకపోయాడు. దీంతో, "ఐపీఎల్ పిచ్లపై ఆడినంత సులభం కాదు ఐసీసీ టోర్నీలు" అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఫైనల్ వంటి కీలక మ్యాచ్లో అతడిని పక్కన పెట్టి మరో ప్లేయర్కు అవకాశం ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

గంభీర్ గట్టి నమ్మకం
ఇంతటి విమర్శల సుడిగుండంలోనూ జట్టు యాజమాన్యం.. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అభిషేక్ శర్మను వెనకేసుకొస్తుండటం గమనార్హం. గంభీర్ నేతృత్వంలోని కోచింగ్ బృందం అభిషేక్ శర్మను కేవలం ఒక బ్యాటర్గా మాత్రమే కాకుండా జట్టులో ఒక 'ఎక్స్ ఫ్యాక్టర్'గా చూస్తోంది. ఒక్కసారి అభిషేక్ ఫామ్ అందుకుంటే ప్రత్యర్థి బౌలింగ్ దాడిని చిన్నాభిన్నం చేయగలడని గంభీర్ గట్టి నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. కీలకమైన ఫైనల్ మ్యాచ్లో విన్నింగ్ కాంబినేషన్ను మార్చి అనవసరమైన ప్రయోగాలు చేయడం కంటే, నమ్మకమున్న ఆటగాళ్లకే మద్దతు ఇవ్వాలని మేనేజ్మెంట్ నిర్ణయించుకుంది.
తోడుగా సంజు శాంసన్
అభిషేక్ శర్మకు తోటి ఆటగాళ్ల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కూడా అభిషేక్పై సానుకూల వ్యాఖ్యలు చేశారు. పెద్ద మ్యాచ్లలో ఒత్తిడిని అధిగమించి ఆడే సత్తా అభిషేక్కు ఉందని.. అటువంటి ఆటగాళ్లు ఒక్కసారి క్లిక్ అయితే మ్యాచ్ స్వరూపమే మారిపోతుందని సంజు అభిప్రాయపడ్డాడు. వరుస విజయాలతో ఫైనల్కు దూసుకొచ్చిన టీమిండియా.. తుది మెట్టు వద్ద రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదని జట్టు సభ్యుల మాటలను బట్టి అర్థమవుతోంది.
అభిషేక్ కెరీర్కు అత్యంత కీలకం
మొత్తానికి మార్చి 8న జరగబోయే ఫైనల్ పోరు అభిషేక్ శర్మ కెరీర్కు అత్యంత కీలకం కానుంది. తనపై వస్తున్న విమర్శలకు మైదానంలో బ్యాట్తోనే సమాధానం చెప్పాల్సిన బాధ్యత అతనిపై ఉంది. గంభీర్, జట్టు యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకాన్ని అభిషేక్ నిలబెట్టుకుంటే.. టీమిండియా మరోసారి ప్రపంచకప్ను ముద్దాడటం ఖాయం. ఒకవేళ మరోసారి నిరాశపరిస్తే మాత్రం, అతని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.