29లో పది మందికి కరోనా
ఈ పర్యటన కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) 29 మంది ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కరోనా ముందుస్తు చర్యల్లో భాగంగా ఆటగాళ్లందరికి పరీక్షలు చేయగా.. పది మంది కరోనా సోకిందని తేలింది. అయితే పాక్ ఆల్రౌండర్ మహ్మద్ హఫీజ్ వ్యక్తిగతంగా మరోసారి పరీక్షలు చేసుకోవడంతో నెగటీవ్ వచ్చింది. దీంతో అతను సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు.
పది మందిని పక్కన పెట్టి..
ఈ నేపథ్యంలో ఈ పది మంది ఆటగాళ్లందరికి శనివారం మరో సారి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆరుగురు ఆటగాళ్లు మొహమ్మద్ హఫీజ్, వహాబ్ రియాజ్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ హస్నైన్ ‘నెగెటివ్'గా తేలారు. అయినా సరే వీరిని మాత్రం అప్పుడే ఇంగ్లండ్కు పంపరాదని పీసీబీ నిర్ణయించింది.
‘నిబంధనల ప్రకారం వరుసగా రెండోసారి వారి టెస్టులు నెగెటివ్గా రావాలి. అప్పుడే ఆ ఆరుగురికి ఇంగ్లండ్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తాం. 18 మంది రెగ్యులర్ ఆటగాళ్లతో పాటు రిజర్వ్గా ఎంపికై నెగెటివ్ వచ్చిన మూసా ఖాన్, రొహైల్ నజీర్ కూడా జట్టుతో పాటు వెళుతున్నారు' అని పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ వెల్లడించారు.
ఆ నలుగురికి మాత్రం..
మరో నలుగురు క్రికెటర్లు హైదర్ అలీ, హారిస్ రవూఫ్, కాశిఫ్ భట్టీ, ఇమ్రాన్ ఖాన్ మాత్రం వరుసగా రెండోసారి కరోనా పాజిటివ్గా బయట పడ్డారు. ఈ టూర్లో భాగంగా ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య 3 టెస్టులు, 3 టి20 మ్యాచ్లు జరుగుతాయి. పాక్ జట్టు ముందుగా మాంచెస్టర్ చేరుకొని అక్కడి నుంచి వస్టర్షైర్కు వెళుతుంది. అక్కడ ఇంగ్లండ్ దేశపు నిబంధనల ప్రకారం కరోనా వామప్ మ్యాచ్లు జరుగుతాయి. ఆపై 14 రోజుల క్వారంటైన్ మొదలవుతుంది. జూలై 30 నుంచి ఇరు జట్ల మధ్య లార్డ్స్లో తొలి టెస్టు జరుగుతుంది. పాక్ జట్టు ప్రయాణం కోసం ఇంగ్లండ్ బోర్డే ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడం విశేషం.
నెగటీవ్.. పాజిటివ్
మహ్మద్ హఫీజ్ను కరోనా ఓ ఆట ఆడుకుంటుంది. అసలు అతనికి కరోనా సోకిందా? లేదా? అనే అనుమానం కూడా కలుగుతుంది. ఒక్క రోజు వ్యవధిలోనే హఫీజ్కు నెగటివ్ రావడంతో అలర్ట్ అయిన పీసీబీ.. శుక్రవారం అతనికి మరోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దాంతో.. సెల్ఫ్ ఐసోలేషన్కి వెళ్లకుండా పరీక్షల కోసం ఫ్యామిలీతో కలిసి ప్రైవేట్ ల్యాబ్కి వెళ్లిన హఫీజ్పై చర్యలు తీసుకునేందుకు కూడా పీసీబీ సిద్ధమైంది. కానీ శనివారం నిర్వహించిన పరీక్షల్లో హఫీజ్కు మళ్లీ నెగటీవ్ రావడం.. ఆదేశ కరోనా వైరస్ టెస్టింగ్ ల్యాబ్స్ సామర్థ్యంపై సందేహాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలోనే పది మందిలో ఆరుగురికి నెగటీవ్ వచ్చినా.. వారిని ఇంగ్లండ్ తీసుకెళ్లేందుకు పీసీబీ సాహసం చేయడం లేదు.
క్రికెట్లో నెపోటిజమ్ లేదా? సచిన్ కొడుకనే అర్జున్ టెండూల్కర్ను ఎంపిక చేయలేదా?