ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో పేలవ ప్రదర్శన కనబర్చిన పాకిస్థాన్ జట్టులో భారీ ప్రక్షాళన చేపట్టినట్లు తెలుస్తోంది. జట్టుకు భారంగా మారిన సీనియర్ ఆటగాళ్లతో పాటు సపోర్ట్ స్టాఫ్ను మార్చే యోచనలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ టెస్ట్ టీమ్ హెడ్ కోచ్గా ఆ జట్టు మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ను నియమించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
గత ఐదు నెలలుగా ఖాళీగా ఉన్న ఈ పదవిని సర్ఫరాజ్ అహ్మద్తో భర్తీ చేయాలని పీసీబీ భావిస్తున్నట్లు ఆ దేశ ఛానెల్ జియో న్యూస్ పేర్కొంది. ఈ ఏడాది మే నెలలో బంగ్లాదేశ్తో జరిగే టెస్ట్ సిరీస్ సమయంలో పాకిస్థాన్ హెడ్ కోచ్గా సర్ఫరాజ్ అహ్మద్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇటీవల ముగిసిన అండర్ 19 ప్రపంచకప్, అండర్ ఆసియా కప్ టోర్నీల్లో పాకిస్థాన్ జట్లకు సర్ఫరాజ్ అహ్మద్ హెడ్ కోచ్గా వ్యవహరించాడు.
అతని మార్గదర్శకంలో పాకిస్థాన్ అండర్ 19 టీమ్ ఆసియా కప్ గెలుచుకుంది. ఫైనల్లో భారత అండర్ 19 జట్టును ఓడించింది. అండర్ 19 ప్రపంచకప్లో మాత్రం భారత్ చేతిలో ఓటమిపాలైంది. భారత జట్టుపై సర్ఫరాజ్ అహ్మద్కు మెరుగైన రికార్డ్ ఉంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ అండర్ 19 టీమ్ ఆసియా కప్ గెలిచిన సందర్భంగా అతన్ని హెడ్ కోచ్గా నియమించాలనే డిమాండ్ వ్యక్తమైంది. పీసీబీ ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీని ఆ దేశ అభిమానుల ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

పాకిస్థాన్ టెస్ట్ టీమ్ హెడ్ కోచ్ పదవి గత ఐదు నెలలుగా ఖాళీ ఉంది. ఇటీవల సౌతాఫ్రికాతో సొంతగడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్ను పాకిస్థాన్ 1-1తో సమం చేసుకుంది. ఈ సిరీస్ సమయంలో అజార్ మహమ్మద్ తాత్కలిక కోచ్గా పని చేశాడు. ప్రస్తుతం సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్థాన్ లయన్స్ జట్టుకు కోచ్గా వ్యవహరిస్తున్నాడు. యూఏఈలో ఇంగ్లండ్ లయన్స్తో టీ20, వన్డే సిరీస్లు ఆడనున్న పాకిస్థాన్ షాహీన్స్ జట్టుతో ఉన్నాడు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో ప్రస్తుతం పాకిస్థాన్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు మే8న బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్తోనే పాకిస్థాన్ హెడ్ కోచ్గా సర్ఫరాజ్ అహ్మద్ బాధ్యతలు చేపడుతాడనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు.
ఇప్పటి వరకు పాకిస్థాన్.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరలేదు. కనీసం ఈసారైనా ఆ ముచ్చట తీర్చుకోవాలనే కసితో ఉంది. ఈ క్రమంలోనే సర్ఫరాజ్ అహ్మద్ను హెడ్ కోచ్గా నియమించాలనే యోచనలో పీసీబీ ఉన్నట్లు తెలుస్తోంది.

పాకిస్థాన్ తరఫున 54 టెస్ట్లు ఆడిన సర్ఫరాజ్ అహ్మద్.. 4 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలతో సహా 3031 పరుగులు చేశాడు. అతను 13 టెస్ట్ల్లో పాకిస్థాన్ జట్టుకు సారథ్యం వహించి 4 విజయాలు అందించాడు. 2018లో లార్డ్స్ టెస్ట్లో ఇంగ్లండ్పై సాధించిన విజయం అతని కెరీర్లో అత్యంత కీలమైనది.
అతను చివరిసారిగా 2023లో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. 117 వన్డేల్లో 2315 పరుగులు, 61 టీ20ల్లో 818 పరుగులు చేశాడు. టీ20ల్లో కెప్టెన్గా అతని విజయాల శాతం 78.37. సర్ఫరాజ్ అహ్మద్ సారథ్యంలోనే పాకిస్థాన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2017 టోర్నీని గెలుచుకుంది. ఫైనల్లో భారత్ను ఓడించి మరి ఛాంపియన్గా నిలిచింది. 2019 వన్డే ప్రపంచకప్లో మాత్రం పాకిస్థాన్ సెమీఫైనల్కు అర్హత సాధించలేకపోయింది. ఆ తర్వాత సర్ఫరాజ్ ఖాన్ కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కోల్పోయాడు. భారత్పై మెరుగైన రికార్డ్ ఉండటంతో అతనికి హెడ్ కోచ్ బాధ్యతలు ఇవ్వాలని పాకిస్థాన్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
