కొంప ముంచిన బ్యాట్స్మెన్ దూకుడు..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్కు మంచి ఆరంభం దక్కింది. రోహిత్ శర్మ(12) త్వరగా ఔటైనా.. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్(20 బంతుల్లో 5 ఫోర్లతో 33) ధాటిగా ఆడటంతో ఆ జట్టు రన్రేట్ 8కి తగ్గలేదు. ఆ తర్వాత సౌరభ్ తివారీ కూడా భారీ షాట్లు ఆడటంతో ఓ దశలో 180 పరుగులు భారీ స్కోర్ నమోదు చేస్తుందేమో అనిపించింది. కానీ మిడిల్ ఓవర్లలో ముఖ్యంగా చెన్నై స్పిన్నర్ల బౌలింగ్లో ధాటిగా ఆడాలని ముంబై బ్యాట్స్మన్ చేసిన ప్రయత్నం వారి కొంపముంచింది. భారీ షాట్లకు ప్రయత్నించిన బ్యాట్స్మెన్ అంతే నిర్లక్ష్యంగా వికెట్ల సమర్పించుకున్నారు. దీనికి తోడు ఫాఫ్ డూప్లెసిస్ పట్టిన రెండు సూపర్ క్యాచ్లు మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచాయి.
అతని కళ్లు చెదిరే క్యాచ్లకు సౌరభ్ తివారీ(31 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 42), హార్ధిక్ పాండ్యా(14)లు వెనుదిరిగారు. ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ కూడా విఫలమవడంతో ముంబై 162 పరుగులకే పరిమితమైంది.
చెత్త ఫీల్డింగ్..
6 నెలల గ్యాప్ తర్వాత మైదానంలోకి దిగడంతో ఇరు జట్ల ఆటగాళ్లు ఫీల్డింగ్లో తడబడ్డారు. అయితే చెన్నై కన్నా ముంబై ఆటగాళ్లే ఫీల్డింగ్లో మరి దారుణంగా వ్యవహరించి మూల్యం చెల్లించుకున్నారు. పదేపదే క్యాచ్లు వదిలేశారు. అంబటి రాయుడుకు లైఫ్ ఇచ్చారు. డూప్లెసిస్ క్యాచ్లు చేజార్చారు. పరుగులు వదిలేశారు. కెప్టెన్ రోహిత్ శర్మతో సహా జట్టంతా మిస్ ఫీల్డ్ చేసింది. ఇక ముంబై టైటిల్ రేసులో నిలవాలంటే మాత్రం ఫీల్డింగ్ మెరుగుపర్చుకోవాలి. వారి ఓటమికి ప్రధాన కారణం చెత్త ఫీల్డింగే. ఈ విషయంలో చెన్నై ముంబై కంటే మెరుగ్గా ఉండటంతో విజయాన్నందుకుంది.
శుభారంభాన్ని కొనసాగించలేక..
ఇక తక్కువ స్కోర్కే పరిమితమైనా..చెన్నై సూపర్ కింగ్స్ను ముంబై ఆదిలోనే దెబ్బతీసింది. తొలి రెండు ఓవర్లలోనే షేన్ వాట్సన్(4), మురళీ విజయ్(1)లను పెవిలియన్ చేర్చింది. కానీ ఆ తర్వాత ఈ జోరును కొనసాగించలేకపోయింది. అనుభవజ్ఞులైన అంబటి రాయుడు, ఫాఫ్ డూప్లెసిస్ జోడీని విడదీయలేకపోయింది. దీంతో ఈ ఇద్దరు మూడో వికెట్కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక ఎన్నో అంచనాలు పెట్టుకున్న జస్ప్రీత్ బుమ్రా పూర్తిగా తేలిపోయాడు. 4 ఓవర్లు వేసి అందరికంటే ఎక్కువగా 43 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ మాత్రమే తీసాడు. ముఖ్యంగా స్పిన్నర్లకు స్వర్గదామమైన యూఏఈలో ఫస్ట్ మ్యాచ్లోనే ముంబై స్పిన్నర్లు తేలిపోయారు. రాహుల్ చాహర్, కృనాల్ పాండ్యా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇది ముంబైకి పెద్ద బలహీనతగా మారింది.
నాలుగు బంతులు..
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 162 పరుగులు చేసింది. సౌరభ్ తివారీ(31 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 42), క్వింటన్ డికాక్(20 బంతుల్లో 5 ఫోర్లతో 33) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు తీయగా.. చాహర్, జడేజా రెండేసి వికెట్ల పడగొట్టారు. చావ్లా, సామ్ కరన్లకు చెరొక వికెట్ లభించింది. అనంతరం చెన్నై 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు చేసి 4 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు(48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 71), ఫాఫ్ డూప్లెసిస్( 44 బంతుల్లో 6 ఫోర్లతో 58 నాటౌట్), సామ్ కరన్(6 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లతో 18)మెరుపులు మెరిపించారు.
ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ప్యాటిన్సన్, పాండ్యా, చాహర్, బుమ్రాలకు తలో వికెట్ దక్కింది.