ఇంతకీ ఏమైందంటే..?
యార్కర్లు వేసే క్రమంలో ఇప్పటికే పలు బీమర్లు సంధించిన సైనీ.. ఈ మ్యాచ్లో కూడా మరో బీమర్ సంధించాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేసిన నవదీప్ సైనీ.. ఐదో బంతిని యార్కర్ వేసే క్రమంలో హై ఫుల్ టాస్ రూపంలో విసిరాడు. దాంతో.. ఆ బంతిని ఫీల్డ్ అంపైర్ నోబాల్గా ప్రకటించగా.. శరీరంపైకి బీమర్ రూపంలో దూసుకొచ్చిన బంతిని అడ్డుకునే క్రమంలో స్టోయినిస్ చేతి వేలికి గాయమైంది. సాధారణంగా బౌలర్ బీమర్ సంధించినప్పుడు.. అదీ బ్యాట్స్మెన్కి తగిలినప్పుడు క్షమాపణ చెప్పడం కనీస సంప్రదాయం. కానీ.. సైనీ ఆ పని చేయలేదు. ఉద్దేశపూర్వకంగా వేయనప్పటికీ మర్యాద కోసమైనా క్షమాపణలు కోరుతారు.
పంత్ ఆగ్రహం..
సైనీ వ్యవహరించిన తీరుపై నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న రిషభ్ పంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ ఓవర్ ముగిసిన తర్వాత స్టోయినిస్కు క్షమాపణ చెప్పాల్సిందిగా సైనీని పంత్ మందలించాడు. దీంతో వెనక్కి తగ్గిన సైనీ.. సారీ తరహాలో సైగ చేసి వెళ్లిపోయాడు. దాంతో.. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో మళ్లీ సైనీ బౌలింగ్కి రాగా.. పంత్- స్టాయినిస్ జోడీ ఉతికారేసింది. ఆ బీమర్ తర్వాత బంతిని ఫోర్గా మలిచిన స్టాయినిస్.. 17వ ఓవర్ రెండో బంతిని మళ్లీ ఫోర్గా తరలించాడు. ఇక రిషబ్ పంత్ అయితే.. ఆ ఓవర్లో వరుసగా 6, 4 బాదేశాడు. మొత్తంగా.. 17వ ఓవర్లో 18 పరుగుల్ని పిండుకున్నారు.
నేలకూలిన తేవాటియా..
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో కూడా నవదీప్ సైనీ బీమర్ సంధించాడు. అది కాస్త నేరుగా రాజస్థాన్ ఆల్రౌండర్ రాహుల్ తెవాటియా చాతికి తాగిలింది. ఈ దెబ్బకు అతను నేల కూలాడు. దాంతో మైదానంలో ఉన్న ఆటగాళ్లతో పాటు టీవీ ముందున్న ప్రేక్షకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పిజియోలు హుటాహుటిన మైదానంలోకి వచ్చి తెవాటియాకు ప్రథమ చికిత్స అందించారు. రాజస్థాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ రెండో బంతి సైనీ చేతిలో నుంచి జారి హైయర్ ఫుల్ టాస్గా 140 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. ఈ బంతిని తెవాటియా స్కూప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అతను వేగంగా బ్యాట్ను ఊపడంతో బంతి నేరుగా వచ్చి అతని చాతిని తగిలింది. దీంతో నొప్పితో విలవిలాడిన తెవాటియా ఒక్కసారిగా మైదానంలో కూలిపోయాడు. ఈ బంతిని అంపైర్ నోబాల్గా ప్రకటించగా.. ఫ్రీహిట్ను తెవాటియా భారీ సిక్సర్ కొట్టి తన గాయం మాములేనని తెలియజేశాడు.
ఫిలిప్ హ్యూజ్ మరణంతో..
బౌలర్లు బీమర్లను సంధించడం కొత్తేమీ కాదు. భారీ షాట్లతో విరుచుకుపడే బ్యాట్స్మెన్ను నియంత్రించడానికి బౌలర్లు బీమర్లను వేస్తుంటారు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లల్లో సచిన్ టెండుల్కర్.. ఇలాంటి బీమర్లను అత్యధికసార్లు ఎదుర్కొన్నాడని క్రికెట్ విశ్లేషకులు చెబుతుంటారు. ఆసీస్ పేస్ బౌలర్ గిలెస్పీ.. వేర్వేరు మ్యాచ్లల్లో ఏకంగా ఆరుసార్లు సచిన్పై బీమర్లు సంధించాడు. ఆసీస్ యంగ్ బ్యాట్స్మెన్ ఫిల్ హ్యూజ్ మరణం అనంతరం.. బీమర్లు సంధించడాన్ని బౌలర్లు తగ్గించారు. ఆస్ట్రేలియా డొమెస్టిక్ క్రికెట్లో తోటి క్రికెటర్ అబాట్ వేసిన ఓ బీమర్కు హ్యూజ్ కన్నుమూశాడు. క్రీజ్లో కుప్పకూలిన అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.