ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో టీమిండియా తమ కాంబినేషన్లో రెండు మార్పులు చేయాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తీలను తుది జట్టు నుంచి తప్పించాలని సూచించాడు. అహ్మదాబాద్ వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్న సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించాలంటే తుది జట్టులో వ్యూహాత్మక మార్పులు చేయాలని సన్నీ సూచించాడు. పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తీ స్థానాల్లో రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్ను ఆడించాలని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు సలహా ఇచ్చాడు.
'అభిషేక్ శర్మ ఐసీసీ నెంబర్ వన్ బ్యాటర్ కావచ్చు. కానీ అతను తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోలేదు. తప్పులను సరిదిద్దుకోవడం లేదు. ప్రత్యర్థి బౌలర్లు అతనికి రూమ్ ఇవ్వకుండా బంతులు వేసి ట్రాప్ చేస్తున్నారు. అతను ఆ వ్యూహాన్ని పసిగట్టకుండా మళ్ళీ మళ్ళీ అదే షాట్ ఆడబోయి వికెట్ ఇచ్చుకుంటున్నాడు.

సెమీఫైనల్లో కూడా విల్ జాక్స్ బిగించిన ఉచ్చులో పడి 9 పరుగులకే వెనుదిరిగాడు. ప్రతి బంతినీ సిక్సర్ కొట్టడం అనేది గల్లీ క్రికెట్, క్లబ్ క్రికెట్లో కూడా సాధ్యం కాదు. అతను తన శైలిని మార్చుకోవడానికి ఇష్టపడటం లేదు. తన విధానాన్ని మార్చుకోలేకపోతున్నాడు. కాబట్టి అభిషేక్ శర్మను పక్కనపెట్టి రింకూ సింగ్ను ఆడించాలి. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్లను ఓపెనర్లుగా బరిలోకి దించాలి.
రింకూ సింగ్పై నాకు పూర్తి నమ్మకం ఉంది. అతని శరీరంపై 'దేవుడి ప్లాన్'అనే టాటూను చూసి ఉంటారు. అతని వల్ల టీమిండియాకు అదృష్టం వస్తుంది. ఫైనల్ వంటి పెద్ద మైదానానికి రింకూ సింగ్ సరైన ఎంపిక'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్లోనే కాకుండా బౌలింగ్లోనూ టీమిండియా మార్పు చేయాలని గవాస్కర్ నొక్కి చెప్పాడు. సెమీఫైనల్లో 64 పరుగులు ఇచ్చిన వరుణ్ చక్రవర్తీని తప్పించి కుల్దీప్ యాదవ్ను ఆడించాలని సూచించాడు.
'వరుణ్ చక్రవర్తి ఆత్మవిశ్వాసం దెబ్బతింటున్నట్లు కనిపిస్తోంది. సూపర్ 8 నుంచి అతను పెద్ద జట్లతో తేలిపోతున్నాడు. అహ్మదాబాద్ మైదానంలో బౌండరీలు పెద్దవి. అక్కడ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ జట్టుకు అదనపు బలాన్ని చేకూరుస్తుంది. ఫ్లాట్ పిచ్లపై కూడా బంతిని టర్న్ చేయగల సామర్థ్యం కుల్దీప్కు ఉంది.'అని గవాస్కర్ పేర్కొన్నాడు.