ఎస్ఓపీ నిబంధనలివే..
ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు అభిమానులను అనుమతించవద్దని, కామెంటేటర్స్ స్టూడియోలో ఆరడుగుల దూరంలో కూర్చోవాలని, డగౌట్స్లో గుంపులుగుంపులుగా ఉండవద్దని, 15 మంది ఆటగాళ్లకు మించి డ్రెస్సింగ్ రూమ్లో ఉండరాదని, పోస్ట్ మ్యాచ్ అవార్డ్ ప్రజెంటేషన్లో కూడా భౌతిక దూరం పాటించాలని, ఆటగాళ్లందరికి రెండువారాల్లో నాలుగుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించాలనే కీలక నిబంధనలతో బీసీసీఐ ఎస్ఓపీ సిద్దం చేసినట్లు తెలుస్తోంది.
ఆటగాళ్లే కాదు.. ప్రతీ ఒక్కరూ..
ఈ బయోబబుల్ నిబంధనలను ఆటగాళ్లే కాకుండా వారి కుటుంబ సభ్యులు, ఫ్రాంచైజీ ఓనర్లందరూ పాటించాల్సిందేనని ఓ బీసీసీఐ అధికారి ఇండియన్ ఎక్స్ప్రెస్కు తెలిపాడు. ‘ఒక్కసారి బయోబబుల్లోకి ప్రవేశించాం అంటే బ్రేక్ చేయడం.. మళ్లీ చేరడం వంటిది ఉండదు. అయితే బీసీసీఐ మాత్రం ఆటగాళ్ల కుటుంబ సభ్యులను అనుమతించే విషయంపై నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీలకే వదిలేసింది. కాకపోతే లీగ్లో పాల్గొనే ప్రతీ ఒక్కరు, ఆఖరికి టీమ్ బస్ డ్రైవర్స్ కూడా బయోబబుల్ ప్రొటోకాల్స్ పాటించాల్సిందే. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనంతరం వచ్చే వారం ఈ ఎస్ఓపీని అన్నీ ఫ్రాంచైజీలకు అందజేస్తాం. వారికేమైనా సందేహాలుంటే వారు మా దృష్టికి తీసుకురావచ్చు. మేం వారితో చర్చించి నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాం' అని సదరు అధికారి పేర్కొన్నారు.
దుబాయ్ వెళ్లకముందే..
ఇంగ్లండ్-వెస్టిండీస్ సిరీస్కు ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) రూపొందించిన నిబంధనల ప్రకారం బీసీసీఐ ఎస్ఓపీని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆ సిరీస్ మాదిరిగానే.. ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఆటగాళ్లందరికి రెండు వారాల వ్యవధిలో నాలుగు సార్లు కరోనా పరీక్షలు చేయనున్నారు. భారత్ నుంచి బయల్దేరే ముందు రెండు పరీక్షలు.. దుబాయ్ చేరుకున్నాక క్వారంటైన్ సమయంలో మరో రెండు సార్లు టెస్ట్ చేయనున్నారు. ఇక గతంలో భారత్కు ఆడిన ఆటగాళ్లు సపరేట్గా తమ ఐపీఎల్ జట్లతో కలిసేవారు. కానీ ఈసారి అలా ఉండదు. టీమ్ ఆటగాళ్లతో కలిసే బయోబబుల్లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది.
డిస్కౌంట్స్ విషయంలో..
ఒక్కో టీమ్లో ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో కలిసి 20 మంది పైగానే ఉంటారు. కాబట్టి జట్టుకు హోటల్ కేటాయించాకా ఎస్ఓపీ గైడ్లైన్స్ ప్రకారం మారే అవకాశం ఉండదు. హోటళ్ల బుకింగ్ విషయంలో డిస్కౌంట్స్ లభించేలా బీసీసీఐ సహాయ సహకారాలు అందిస్తుందని ఇప్పటికే ఫ్రాంచైజీలకు సమాచారం అందించింది. హోటల్ సిబ్బందికి కూడా కరోనా పరీక్షల్లో నెగటీవ్ వస్తేనే అనుమతించేలా ఏర్పాట్లు చేయనుంది. ఇక బ్రాడ్కాస్టర్స్ అఫిషియల్స్కు కూడా బీసీసీఐ ఈ ఎస్ఓపీ అందజేయనుంది.
రిస్క్ తీసుకోం..
యూఏఈలో కరోనా ప్రభావం అంతగా లేనప్పటికీ ఫ్యాన్స్ అనుమతించి రిస్క్ తీసుకోదల్చుకోలేదని మరో బీసీసీఐ అధికారి తెలిపారు. ‘మేం రిస్క్ చేయదల్చుకోలేదు. కనీసం టోర్నీ ఆంభంలోనైనా ప్రేక్షకుల్లేకుండా నిర్వహించాలనుకుంటున్నాం'అని తెలిపారు. ఇక గల్ఫ్ న్యూస్ లెక్కల ప్రకారం దుబాయ్లో బుధవారం కొత్తగా 375 కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకు మొత్తం 59,921 మంది మహమ్మారి బారిన పడ్డారు. ఇందులో 53,202 మంది కోలుకున్నారు.