రాయుడు ఉంటే..
చెన్నై వైఫల్యానికి కారణాలు ఏంటని సహచర తెలుగు కామెంటేటర్ కళ్యాణ్ ప్రశ్నించగా.. ఎమ్మెస్కే ఈ విధంగా బదులిచ్చాడు. ‘రాయుడు లేనిలోటు స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా భాగస్వామ్యాలు నెలకొల్పడంలో సీఎస్కే బ్యాట్స్మన్ విఫలమయ్యారు. అలాగే మురళీ విజయ్ కూడా ఎక్కువ బంతులు తీసుకున్నాడు. క్రీజులో కుదురుకున్నాక రాంగ్ షాట్ ఎంచుకొని ఔటయ్యాడు. సామ్ కరన్, రుతురాజ్ గైక్వాడ్ బ్యాక్ టు బ్యాక్ పెవిలియన్ చేరడం కూడా చెన్నైని దెబ్బతీసింది. 217 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించాలంటే ఆరంభం నుంచే ధాటిగా ఆడాలి. వాట్సన్ వికెట్ రాజస్థాన్కు మలుపు. రాహుల్ తెవాటియా చాలా తెలివిగా బౌలింగ్ చేశాడు. రాయుడు వంటి అనుభవపూర్వకమైన బ్యాట్స్మెన్ ఉంటే ఫలితం మరోలా ఉండేది. 'అని ఎమ్మెస్కే చెప్పుకొచ్చాడు.
ధోనీ నాలుగులో వచ్చి ఉంటే..
ఇక మ్యాచ్ అనంతరం టాలీవుడ్ హీరో నందు హోస్ట్గా వ్యవహరిస్తున్న ‘బైజూస్ క్రికెట్ లైవ్'షోలో కూడా ఎమ్మెస్కే మాట్లాడాడు. ఆఖరి ఓవర్లో ధోనీ బ్యాటింగ్ చూసిన తర్వాత అతను నాలుగో స్థానంలో వస్తే జట్టు చాలా మేలు జరిగేదన్నాడు. మ్యాచ్ ఓడినా ధోనీ హ్యాట్రిక్ సిక్సర్లతో చెలరేగడం అభిమానులను ఆకట్టుకుందని తెలిపాడు. అలాగే ప్రత్యర్థులకు ‘ఐయామ్ బ్యాక్'అనే హెచ్చరికను ధోనీ తన బ్యాటింగ్ ద్వారా తెలియజేశాడని అభిప్రాయపడ్డాడు. సంజూ శాంసన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని, జడేజా, చావ్లా వంటి మేటి బౌలర్లను చితక్కొట్టాడని ప్రశంసించాడు. స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ బాగుందన్న ఎమ్మెస్కే.. ఎప్పుడూ ఓపెనింగ్ చేయని ఈ ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ జట్టు కోసం ముందు వచ్చి చివరిదాకా ఓపికగా నిలబడటం చాలా గొప్ప విషయమని కొనియాడాడు.
జోఫ్రా ఆర్చర్ ఎంటో చూపించాడు..
ఇక రాజస్థాన్ ఇన్నింగ్స్లో శాంసన్, స్మిత్ ఇన్నింగ్స్ ఎంత కీలకమో.. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ సృష్టించిన విధ్వంసం అంతే ముఖ్యమన్నాడు. ‘జోఫ్రా ఆర్చర్ ఇన్నింగ్సే రాజస్థాన్ విజయానికి కారణమని చెప్పాలి. అతను ఆ చివరి ఓవర్లో 30 పరుగులు చేయకుంటే చెన్నై సులువుగా చేధించేది. రాజస్థాన్ ఎందుకు ఆర్చర్ను ఆల్రౌండర్గా పరిగణిస్తుందో ఈ మ్యాచ్తో అందరికి అర్ధమైంది. లుంగిడి ఎంగిడి వంటి వరల్డ్ క్లాస్ బౌలర్ను చితక్కొట్టడం మాములు విషయం కాదు. ఇక చెన్నై జట్టులో ఫాఫ్ డూప్లెసిస్ అద్భుతంగా ఆడాడు. తొలుత క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నించినా.. తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు.'అని ఎమ్మెస్కే చెప్పుకొచ్చాడు.
అప్పుడు రాయుడిని తీసేసి..
ఇక భారత వన్డే ప్రపంచకప్ జట్టులో అంబటి రాయుడిని ఎంపిక చేయకుండా వేటు వేసిన ఎమ్మెస్కే ఇప్పుడు అతని ఆటను ప్రశంసించడంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ప్రపంచకప్ ప్రాబబుల్స్లో ఉన్న రాయుడికి ఆఖరి క్షణంలో మొండి చెయ్యి ఎదురైన విషయం తెలిసిందే. అతన్ని పక్కన పెట్టి త్రీడీ ఆటగాడంటూ విజయ్ శంకర్ను జట్టులోకి తీసుకున్నారు. దీనిపై రాయుడు బాహాటంగానే విమర్శలు గుప్పించాడు. త్రీడీ గ్లాసెస్లో ఆటను చూస్తానని సెటైరిక్గా ట్వీట్ చేశాడు.
ఈ ట్వీటే.. విజయ్ శంకర్, శిఖర్ ధావన్ గాయపడ్డా రాయుడికి జట్టులో చోటు దక్కకుండా చేసింది. రాయుడు వైఖరిపై ఆగ్రహంగా ఉన్న సెలెక్షన్ కమిటీ అతన్ని కాదని పంత్, మయాంక్ అగర్వాల్ను ఇంగ్లండ్కు పంపించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైనా రాయుడు.. సెలెక్టర్లపై కోపంతో రిటైర్మెంట్ ప్రకటించాడు. అనంతరం మనసు మార్చుకోని రిటైర్మెంట్ను వెనక్కు తీసుకొని ఐపీఎల్ బరిలో నిలిచాడు. ఫస్ట్ మ్యాచ్లోనే సూపర్ ఫిఫ్టీతో సత్తాచాటాడు.
ఏడో స్థానంలో ధోనీ రావడం బుద్ది తక్కువ పని.. ఆ హ్యాట్రిక్ సిక్స్లు ఎందుకు పనికిరావు: గౌతమ్ గంభీర్