ధోనీ ముందు వస్తే ..
రాజస్థాన్ రాయల్స్ నిర్ధేశించిన 217 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో చెన్నై బ్యాట్స్మన్ తడబడ్డారు. షేన్ వాట్సన్(21 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 33)అందించిన శుభారంభాన్ని మిడిలార్డర్ బ్యాట్స్మన్ అందిపుచ్చుకోలేకపోయారు. సామ్ కరన్, రుతురాజ్ గైక్వాడ్ అనసవర షాట్లకు పోయి బ్యాక్టు బ్యాక్ వికెట్లు చేజార్చుకున్నారు. ఆ తర్వాత జాదవ్ కూడా విఫలమవడంతో ధోనీ ఏడో స్థానంలో క్రీజులోకి వచ్చాడు. అయితే సామ్ కరన్ వచ్చిన స్థానంలో ధోనీ వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని మ్యాచ్ ముగిసిన తర్వాత చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
బుద్ది తక్కువ పని..
ఇదే విషయాన్ని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో టీ20 టైమ్ ఔట్ కార్యక్రమంలో గౌతమ్ గంభీర్ ప్రస్తావిస్తూ ధోనీపై విమర్శలు గుప్పించాడు. ‘ఎంఎస్ ధోనీ ఏడో స్థానంలో రావడం చూసి ఆశ్చర్యపోయా. అతను రాకుండా సామ్ కరన్, రుతురాజ్ గైక్వాడ్ను పంపించడం బుద్ది తక్కువ పని. ధోనీ వచ్చి బాధ్యత తీసుకోవాల్సింది. జట్టును ముందుండి నడిపించడం అంటే ఇది కాదు. ఏడో స్థానంలో బ్యాటింగ్ వచ్చి ఏం చేస్తాడు. 217 పరుగులను ఎలా చేజ్ చేస్తాడు. అక్కడ ఫాఫ్ డూప్లెసిస్ ఒంటరి వాడైపోయాడు.
హ్యాట్రిక్ సిక్స్లు ఎందుకు పనికిరావు..
మీరు ధోనీ చివరి ఓవర్ బ్యాటింగ్ గురించి మాట్లాడవచ్చు. నా ముందు హ్యాట్రిక్ సిక్స్ల గురించి ప్రస్తావించవచ్చు. కానీ వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వ్యక్తిగత పరుగుల కోసం తప్పా అవి ఎందుకు పనికిరావు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చి త్వరగా ఔటైతే అందులో తప్పేం ఉండదు. కనీసం పోరాడినట్లు ఉంటుంది. జట్టులో స్పూర్తిని రగిల్చినట్లుంటుంది' అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
క్వారంటైన్ దెబ్బతీసింది..
ఏడో స్థానంలో బ్యాటింగ్ రావడంపై కామెంటేటర్ మురళీ కార్తీక్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేన్లో ధోనీని ప్రశ్నించగా అతను వివరణ ఇచ్చుకున్నాడు. ‘14 రోజుల క్వారంటైన్ నిబంధన నా ప్రాక్టీస్పై ప్రభావం చూపింది. సాధనకు అవసరమైన సమయం దొరకలేదు. అందులోనూ గత ఏడాది కాలంగా బ్యాటింగ్ చేయలేదు. అందుకే లోయారర్డర్లో బ్యాటింగ్ వచ్చా. ప్రయోగంలో భాగంగానే సామ్ కరన్కు అవకాశం ఇచ్చా. ఇలాంటి ప్రయత్నాలు విఫలమైతే మన బలాలపై మనం ఫోకస్ పెట్టవచ్చు. ఫాఫ్ అద్భుతంగా ఆడాడు. మా బ్యాట్స్మెన్ ఇంకొంచెం ఏదైనా చేయాల్సింది. స్క్వేర్లెగ్ను నిర్లక్ష్యం చేసి లాంగాన్ లాంగాఫ్లో షాట్స్ ఆడి మూల్యం చెల్లించుకున్నారు.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సంజూ శాంసన్ (32 బంతుల్లో 1 ఫోర్, 9 సిక్సర్లతో 74) దూకుడుకు తోడు కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్మిత్ (47 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 69), జోఫ్రా ఆర్చర్ (8 బంతుల్లో 4 సిక్సర్లతో 27 నాటౌట్) చెలరేగడంతో రాజస్థాన్ రాయల్స్ చెన్నై ముందు 217 పరుగుల భారీ టార్గెట్ నిర్ధేశించింది. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు చేసి 16 పరుగులతో ఓడింది.
RR vs CSK Trolls: శాంసన్ ధాటికి ధోనీ దిమ్మతిరిగింది.. సీఎస్కే ఫ్యాన్స్కు వణుకు పుట్టింది!