కరోనా సబ్స్టిట్యూట్..
అంతర్జాతీయ క్రికెట్ను పునరుద్దరించేందుకు అన్ని క్రికెట్ బోర్డులు ప్రయత్నాలు మొదలు పెట్టిన విషయం తెలిసిదే. ఈ నేపథ్యంలో ఆట మధ్యలో ఎవరైనా ఆటగాడిలో కరోనా లక్షణాలు బయటపడితే సబ్స్టిట్యూట్కు అనుమతి ఇవ్వాలని ఇంగ్లండ్ బోర్డు కోరింది. ఇందుకు ఐసీసీ ఆమోదముద్ర వేసింది. కంకషన్ సబ్స్టిట్యూట్ మాదిరిగానే బౌలర్కు బౌలర్, బ్యాటర్కు బ్యాటర్ను మ్యాచ్ రిఫరీ అనుమతి మేరకు సబ్స్టిట్యూట్గా తీసుకోవచ్చని, ఇది కేవలం టెస్టులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లు టీ20, వన్డేలకు వర్తించదని స్పష్టం చేసింది.
ఉమ్మి రుద్దితే పెనాల్టిగా 5 రన్స్
బంతిపై మరింత మెరుపు తెచ్చేందుకు, రివర్స్ స్వింగ్ రాబట్టేందుకు ఆటగాళ్లు ఇకపై ఉమ్మిని ఉపయోగించకూడదు. ఐసీసీ ప్రకటించిన తాత్కలిక నిబంధనల మేరకు.. ఒకవేళ ఆటగాడు మర్చిపోయి లాలాజలం రుద్దితే అంపైర్లు కొంత వెసులుబాటు ఇస్తారు. మళ్లీ రుద్దితే మాత్రం హెచ్చరిస్తారు. రెండు హెచ్చరికల తర్వాతా కూడా ఇదే పునరావృతమైతే ఐదు పరుగులు జరిమానా విధిస్తారు. ప్రత్యర్థి జట్టు ఖాతాలో వాటిని వేస్తారు.
స్థానిక అంపైర్లు..
ప్రయాణాలపై ఆంక్షలు నేపథ్యంలో తటస్థ అంపైర్ల నిబంధనను ఐసీసీ కొంతకాలం మేరకు రద్దు చేసింది. స్థానిక అంపైర్లను వాడుకోవచ్చని తెలిపింది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్, ఎమిరేట్స్ ఐసీసీ ఇంటర్నేషనల్ మ్యాచ్ అఫీషియల్స్ నుంచి ఐసీసీ వీరిని నియమిస్తుంది.
అదనపు సమీక్ష..
కరోనా నేపథ్యంలో ప్రస్తుతం అనుభవం ఉన్న అంపైర్ల కొరత ఏర్పడనుంది. స్థానిక అంపైర్లతో మ్యాచ్లు నిర్వహించినా.. తప్పిదాలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ సమస్యను అధిగమించేందుకు ప్రతి ఇన్నింగ్స్లో ఇక విఫల డీఆర్ఎస్ తర్వాత రెండు జట్లకు అదనంగా మరో డీఆర్ఎస్కు అనుమతి ఇస్తున్నామని క్రికెట్ కమిటీ తెలిపింది. దీంతో టెస్టుల్లో 3, పరిమిత ఓవర్ల క్రికెట్లో 2కు డీఆర్ఎస్ల సంఖ్య పెరుగుతుంది. ఆటగాళ్లు నిబంధనలు అతిక్రమించకుండా పర్యవేక్షించేందుకు తటస్థ ఎలైట్ ప్యానెల్ రిఫరీ ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంటారు. 12 నెలల పాటు జెర్సీపై మరో లోగోకు అనుమతి ఇస్తున్నామని ఐసీసీ తెలిపింది.