
న్యూఢిల్లీ: ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా తాను కూడా జాతి వివక్ష వ్యాఖ్యల్ని ఎదుర్కొన్నానని వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ తెలిపిన విషయం తెలిసిందే. 2013, 2014 సీజన్లలో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన సమయంలో తనతో పాటు శ్రీలంక క్రికెటర్ తిసారా పెరీరా వర్ణ వివక్షకు గురయ్యాడని తెలిపాడు. 'సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సమయంలో నన్ను, పెరీరాను 'కాలూ... కాలూ' (నల్లోడు) అని పిలిచేవారు. అప్పుడు దానర్థం మాకు తెలిసేది కాదు. భారత్లో 'కాలూ' అంటే 'బలమైన వ్యక్తి' అని పిలుస్తున్నారేమో అనుకునేవాడిని. కానీ ఈ మధ్యే ఆ పదానికి అర్థం తెలుసుకున్నా. చాలా బాధగా ఉంది'అని సామీ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు.
అంతేకాకుండా అప్పట్లో తనను అలా పిలిచినవారు క్షమాపణలు కూడా చెప్పాలని డిమాండ్ చేశాడు. అయితే సామీ వర్ణ వివక్షకు గురైన విషయం తమకు తెలియదని నాటి ఆటగాళ్లు ఇర్ఫాన్ పఠాన్, పార్ధీవ్ పటేల్, వేణుగోపాల్ రావు తెలిపారు. అయితే 2014లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడైన ఇషాంత్ శర్మ.. సామీని 'కాలు' అని పిలుస్తూ చేసిన ఇన్స్టా పోస్ట్ వైరల్ అయింది. అప్పటి సన్రైజర్స్ జట్టు సభ్యులు భువనేశ్వర్, స్టెయిన్లతో పాటు సామీతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన ఇషాంత్ 'నేను, భువి, కాలూ, గన్' అంటూ క్యాప్షన్ పెట్టాడు. అయితే ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండడంతో నెటిజన్లు ఇషాంత్ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. సామీ చెప్పిన మాటలు నిజమేనని అభిప్రాయపడుతున్నారు.
ఇక సామీ కూడా తనకు కాలు అనే నిక్నేమ్ సన్రైజర్స్ టీమ్మేనేజ్మెంట్ ఇచ్చినట్లు ట్వీట్ చేశాడు. 2014లో లక్ష్మణ్ బర్త్డే సందర్బంగా అతనికి విషేస్ తెలియజేస్తూ.. తనకు కాలూ అనే నిక్ నేమ్ పెట్టారనే విషయాన్ని ప్రస్తావించాడు.