— faceplatter49 (@faceplatter49) March 10, 2020 |
9 మీటర్ రూల్తో తప్పించుకున్న పుజారా..
తొలి రోజు అస్వస్థత కారణంగా రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన పుజారా (237 బంతుల్లో 5 ఫోర్లతో 66)రెండో రోజు మళ్లీ బ్యాటింగ్ చేశాడు. అర్పిత్తో కలిసి సౌరాష్ట్ర ఇన్నింగ్స్ను గాడిలో పెట్టాడు. ఇద్దరూ రెండు సెషన్లపాటు ఆడటంతోపాటు ఆరో వికెట్కు 380 బంతుల్లో 142 పరుగులు జోడించారు. అయితే అంతకుముందు పుజారా ఎల్బీడబ్ల్యూ అయ్యే ప్రమాదం నుంచి తప్పించకున్నాడు. షెహ్బాజ్ అహ్మద్ వేసిన 99వ ఓవర్లో పుజారా క్రీజు ముందుకు వచ్చి డిఫెన్స్ చేశాడు. అయితే బంతి పుజారా ప్యాడ్లను తాకి బ్యాట్కు తగిలింది. దీంతో బెంగాల్ ఆటగాళ్లు ఎల్బీ కోసం అప్పీల్ చేశారు. ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. దీంతో బెంగాల్ రివ్యూకు వెళ్లగా.. రిప్లేలో బంతి పుజారా ప్యాడ్తో పాటు వికెట్లను హిట్ చేసినట్లు స్పష్టమైంది. కానీ డొమెస్టిక్ క్రికెట్లో ఉన్న 9 మీటర్ రూల్ కారణంగా పుజారా ఔటయ్యే ప్రమాదం నుంచి గట్టెక్కాడు.
ఇంతకీ 9 మీటర్ రూల్ ఏంటీ?
డొమెస్టిక్ క్రికెట్లో డీఆర్ఎస్ సాంకేతికంగా పరిమితంగా ఉండటంతో ఈ 9 మీటర్ల రూల్ను తీసుకొచ్చారు. ఈ నిబంధన ప్రకారం బ్యాట్స్మన్ 9 మీటర్ల మార్క్ను దాటితే అతనికి ఎల్బీడబ్ల్యూ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నిబంధననే పుజారాను ఔటవ్వకుండా కాపాడింది. ఇక దీనిపై బెంగాల్ ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేశారు. అంపైర్లతో వాగ్వాదానికి కూడా దిగారు. వారు ఈ నిబంధనను ఆటగాళ్లకు వివరించారు. క్రికెటర్లకే అవగాహన లేనీ ఈ రూల్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఫుట్ క్యాష్ ఉన్న బీసీసీఐ.. డొమెస్టిక్ క్రికెట్లో డీఆర్ఎస్ సాంకేతికతను ఉపయోగించలేదా? అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. కనీసం పుజారాకైనా ఈ రూల్ తెలుసా? అనే సెటైర్లు పేలుతున్నాయి.
Road Safety World Series 2020: వారెవ్వా కైఫ్.. వాటే ఫీల్డింగ్.. ఈ వయసులో కూడా !!
రెండు వైపుల ఒకే అంపైర్..
ఈ మ్యాచ్ రెండో రోజే విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఒక సెషన్ పాటు రెండు వైపుల ఒకరే అంపైరింగ్ చేశారు. వికెట్ తీసిన ఆనందంలో బెంగాల్ ఫీల్డర్ ఒకరు బంతిని విసరగా అది లెగ్ అంపై షంషుద్దీన్ పొత్తి కడుపులో బలంగా తగిలింది. దీంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న అంపైర్ను సౌరాష్ట్ర క్రికెట్ సంఘం అధికారులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఒక సెషన్ పాటు మరో ఆన్ఫీల్డ్ అంపైర్ కేఎన్ అనంతపద్మనాభన్ రెండు ఎండ్ల నుంచి అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. స్థానిక అంపైర్ పీయూష్ కక్కడ్ స్క్వేర్ లెగ్ అంపైర్గా నిలబడిపోయారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఈ మ్యాచ్కు తటస్థ అంపైర్లు ఉండాలి. పీయూష్ సౌరాష్ట్రకు చెందినవాడు కావడంతో మెయిన్ ఎండ్ నుంచి అంపైరింగ్ చేయనివ్వలేదు.
థర్డ్ అంపైర్ రవికి మాత్రమే డీఆర్ఎస్ విధానంపై అవగాహన ఉండటంతో ఆయనా మైదానంలోకి రాలేదు. చివరకు షంషుద్దీన్ను టీవీ అంపైర్ స్థానంలో కూర్చోబెట్టి రవి ఆ తర్వాత అంపైరింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఇక ముంబై నుంచి వచ్చిన యశ్వంత్ బర్డే నేటినుంచి ఫీల్డ్ అంపైర్గా వ్యవహరిస్తున్నాడు.
సౌరాష్ట్ర 425 ఆలౌట్
ఓవర్నైట్ స్కోర్ 384/8తో మూడో రోజు ఆటను కొనసాగించిన సౌరాష్ట్ర మరో 41 పరుగులు మాత్రమే జోడించి 171.5 ఓవర్లలో 425 పరుగులుకు తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఓవర్ నైట్ బ్యాట్స్మన్ చిరాగ్ జానీ (14) ఒకే పరుగు చేయగా.., ధర్మేంద్ర సింగ్ జడేజా (33 నాటౌట్) మరో 11 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కెప్టెన్ ఉనాద్కల్ (20) పరుగులు చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్ 68 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.