|
భారత క్రికెటర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు..
ముఖ్యంగా గతేడాది జరిగిన ప్రపంచకప్లో ఇంగ్లండ్ చేతిలో భారత ఓడిన లీగ్ మ్యాచ్ను ఈ పుస్తకంలో ప్రస్తావిస్తూ భారత క్రికెటర్లపై స్టోక్స్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. లీగ్ ఆసాంతం అదరగొట్టిన భారత్ ఆ మ్యాచ్లో మాత్రం ఓటమిపాలైంది. అయితే ఆ మ్యాచ్ అనంతరం తమ ఓటమికి చిన్న బౌండరీలే కారణమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పిన కారణాన్ని స్టోక్స్ తప్పుబట్టాడు. కోహ్లీ నుంచి అలాంటి మాటలను ఊహించలేదని, అదో చెత్త ఫిర్యాదని ఘాటుగా రాసుకొచ్చాడు. అంతటితో ఆగకుండా భారత మాజీ కెప్టెన్, మహేంద్ర సింగ్ ధోనీలో మ్యాచ్ గెలవాలనే కసి కనిపించలేదన్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ భాగస్వామ్యం విస్మయపరిచిందన్నాడు.
|
పాక్ సెమీస్ చేరకుండా..
అయితే ఈ ఓటమిపై అప్పట్లోనే తీవ్ర దుమారం రేగింది. పాకిస్తాన్ సెమీస్ చేరకుండా అడ్డుకోవడానికే భారతే కావాలని ఇంగ్లండ్ చేతిలో ఓడిందనే విమర్శలు వినిపించాయి. తాజాగా స్టోక్స్ కూడా అదే విషయాన్ని తన పుస్తకంలో ప్రస్తావించాడని పాకిస్థాన్ మాజీ బౌలర్ సికిందర్ బక్త్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ చేతిలో భారత్ ఉద్దేశపూర్వకంగే ఓడిపోయిందనే విషయాన్ని స్టోక్స్ తన బుక్లో వెల్లడించాడని తెలిపాడు. దీనికి సంబంధించి ఓ పాకిస్థాన్ చానెల్ వేదికగా జరిగిన డిబేట్ వీడియోను ట్వీట్ చేశాడు. అయితే దీనిపై సికిందర్ బక్త్ను ఒక నెటిజన్ నిలదీసాడు. ఈ విషయాన్ని స్టోక్స్ ఎక్కడ చెప్పాడో ఆధారాలు చూపించగలవా? అని ప్రశ్నించాడు.
స్టోక్స్ కూడా ఫైర్..
ఇక ఈ ట్వీట్ను చూసిన స్టోక్స్ కూడా సికిందర్పై మండిపడ్డాడు. తాను ఎక్కడ ఆ విషయాన్ని పేర్కొన్నానో చెప్పాలంటూ నిలదీశాడు. తాను అనని వ్యాఖ్యలను వెతికి పట్టుకోవడం కుదరని పని అంటూ ఎద్దేవా చేశాడు. వాస్తవానికి స్టోక్స్ తనపుస్తకంలో ధోనీ ఆడుతున్న రన్రేట్ను మాత్రమే ప్రస్తావించాడు. ఒకవేళ భారత్ ఓడిపోయినా అదే రన్రేట్ను ధోని కడవరకూ కొనసాగిస్తే భారత్కు మంచి రన్రేట్ ఉంటుందని మాత్రమే పేర్కొన్నాడు.
'లక్ష్య ఛేదనలో భారత్ విజయానికి 11 ఓవర్లలో 112 పరుగులు అవసరమైనప్పుడు ఎంఎస్ ధోనీ క్రిజులోకి వచ్చాడు. అప్పుడు అతడి ఆటలో అసలు తీవ్రతే కనిపించలేదు. సిక్సర్లు బాదడం కన్నా.. సింగిల్స్పైనే ఎక్కువ దృష్టి సారించడం నన్ను ఆశ్చర్యపరిచింది. రెండు ఓవర్లు మిగిలున్నప్పుడు కూడా భారత్కు గెలుపుకు మెండుగా అవకాశాలు ఉన్నాయి. ధోనీ భాగస్వామి కేదార్ జాదవ్లోనూ తీవ్రత కనిపించలేదు. నా వరకైతే విరుచుకుపడితేనే గెలుపుకు అవకాశాలు ఉంటాయి' అని మాత్రమే రాసుకొచ్చాడు తప్పా.. ఎక్కడ ఉద్దేశపూర్వకంగా భారత్ ఓడిపోయిందని చెప్పలేదు.
పోరాడినా గెలవలేకపోయారు..
ఇంగ్లండ్తో జరిగిన నాటి లీగ్ మ్యాచ్లో భారత్ 31 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 337 పరుగులు చేయగా, భారత్ 306 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఆ మ్యాచ్లో రోహిత్ శర్మ(102), కోహ్లీ(66), రిషభ్ పంత్(32), హార్దిక్ పాండ్యా(45), ఎంఎస్ ధోని(42 నాటౌట్)లు రాణించినా భారీ లక్ష్యం కావడంతో జట్టును గెలిపించలేకపోయారు. చివరి వరకూ ధోని క్రీజ్లో ఉన్నా భారత్ను విజయ తీరాలకు చేర్చలేకపోయాడు.