కోహ్లీ చెప్పేదంతా అబద్దం.. లైవ్ సెషన్లో అరిచిన అనుష్క!

న్యూఢిల్లీ: భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ మైదానంలో తన ఆటతో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెడుతుంటాడు. కానీ ఆదివారం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో జరిపిన ఇన్స్టా లైవ్ సెషన్లో ఈ స్టార్ ఫుట్బాలర్ తన ప్రశ్నలతో రన్మిషన్ను ఉక్కిరి బిక్కిరి చేశాడు. మంచి ప్రశ్నలతో ముందే ప్రిపేరై వచ్చిన ఛెత్రీకి సమాధానాలు చెప్పలేక కోహ్లీ ఓ సందర్భంలో అబద్దాలు కూడా ఆడాడు. కానీ కరోనా కారణంగా తనతో పాటు ఇంట్లోనే ఉంటున్న అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మ అతని బండారాన్ని బయటపెట్టింది. అబద్దాలు చెబుతున్నాడని గట్టిగా అరిచింది. దీంతో కోహ్లీ ముఖం చిన్నబోయింది. ఈ ఘటనతో అక్కడ నవ్వులు పూసాయి.

ఇంతకేం జరిగిందంటే..?
విరాట్-అనుష్కకు సంబంధించిన ఓ విషయాన్ని ఛేత్రీ గుర్తు చేశాడు. అనుష్క షూటింగ్ వెళ్లిన విరాట్.. ఐదు నిమిషాలకే హోటల్కు వెళ్లి పడుకున్నాడని అప్పట్లో జరిగిన ప్రచారాన్ని ప్రస్తావిస్తూ కోహ్లీని ప్రశ్నించాడు. ‘నువ్వు(కోహ్లీ).. లండన్కు వెళ్లినప్పుడు అనుష్కకు మద్దతుగా ఆమె షూటింగ్ సెట్టింగ్కు వెళ్లావు. అక్కడ కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఉండి ఆ తర్వాత హోట్ల్కు వెళ్లి పడుకున్నావు. ఆమె నీకు మద్దతుగా నీవు బ్యాటింగ్ చేయకున్నా టెస్ట్ మ్యాచ్ మొత్తం చూస్తుంది. నువ్వు మాత్రం ఐదు నిమిషాలకే పడుకుంటావా?'అని కోహ్లీని ఛెత్రీ అడిగాడు.

అబ్బే.. హోటల్కు వెళ్లలేదు..
అయితే ఇదంతా అబద్దమని, వాస్తవం వేరని కోహ్లీ చెప్పుకొచ్చాడు. మీడియాలో వచ్చిందంతా అక్కడ జరగలేదన్నాడు. అర్థరాత్రి లండన్ చేరిన తాను నేరుగా సెట్స్కు వెళ్లానని, బాగా అలసిపోవడంతో పక్కనే ఉన్న వ్యాన్లో పడుకున్నానని తెలిపాడు. అక్కడ ఉన్న వ్యక్తికి ఈ విషయం అనుష్క చెప్పమన్నానని, కానీ అతను మర్చిపోయాడన్నాడు. అంతేకానీ తానేం హోటల్కు వెళ్లి పడుకోలేదని చెప్పుకొచ్చాడు. అయితే కోహ్లీ ఇదంతా చెబుతున్నప్పుడు అదే రూమ్లో ఉన్న అనుష్క.. ఇదంతా అబ్బద్దమని, జూతా అని గట్టిగా అరిచింది. దీంతో కోహ్లీ బండారం మొత్తం బయటపడింది.

నా ఫిట్నెస్ క్రెడిట్ అతనిదే..
2015 నుంచి ఫిట్నెస్ పరంగా శ్రద్ధ తీసుకోవడం ఆరంభించానని, అప్పట్నుంచే తన కెరీర్ గ్రాఫ్ క్రమేపీ పెరుగుతూ వచ్చిందిని ఈ సందర్బంగా కోహ్లీ తెలిపాడు. తన ఫిట్నెస్ క్రెడిట్ టీమిండియా మాజీ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ శంకర్ బసూదేనన్నాడు.‘నా ప్రస్తుత ఫిట్నెస్ క్రెడిట్ శంకర్ బసూదే. నా కెరీర్లో ఫిట్నెస్ పరంగా వచ్చిన అతి పెద్ద మార్పు 2015 నుంచి ప్రారంభమైంది. నా కెరీర్ మరో స్థాయికి వెళ్లడంలో శంకర్ బసూ పాత్ర మరువలేనిది' అని కోహ్లీ వెల్లడించాడు. 2015 నుంచి 2019 వరకూ భారత క్రికెట్ జట్టు ఫిట్నెస్ ట్రైనర్గా శంకర్ బసూ కొనసాగాడు.

మొదట్లో కష్టంగా అనిపించింది..
ఐపీఎల్లో ఆర్సీబీ ట్రైనర్గా బసూ కొనసాగిన సమయంలో లిఫ్టింగ్ను తీసుకొచ్చారని, దానికి మొదట్లో తాను కొంత సంశయించానని విరాట్ అన్నాడు.
‘లిఫ్టింగ్ వల్ల మొదట్లో నాకు నడుంనొప్పి సమస్యలు కూడా వచ్చాయి. అది నాకు చాలా కొత్త కాన్సెప్ట్ అనిపించింది. కానీ దాన్ని ప్రారంభించిన మూడు వారాల తర్వాత అమోఘమైన ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత నా డైట్లోనూ ఆయన సమూల మార్పులు తీసుకొచ్చారు. నా శరీరంలో జరిగే మార్పులు గమనించాను. నా శారీరక పరిస్థితిని బట్టి రోజుకి రెండు-మూడు సార్లు ఆయన చెప్పే దానిని పాటిస్తూ వచ్చాను. నా కెరీర్కు ఏది కావాలో అవే సూచనలు చేశారు బసూ. దేశం తరఫున ఆడాలంటే మరింత శ్రమించక తప్పదనే విషయాన్ని గ్రహించాను. ఒకవేళ మనం శ్రమించడంలో వెనుకంజ వేస్తే మాత్రం అనుకున్నది సాధించడానికి చాలా దూరంలో ఆగిపోతాం'అని కోహ్లీ తెలిపాడు.
మహేశ్ బాబు ‘మైండ్బ్లాక్' పాటకు డ్యాన్స్ చేయలేనన్న వార్నర్.. ఎందుకంటే?
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications