టీమిండియా విధ్వంసకర ఓపెనర్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే నాకౌట్ మ్యాచ్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన తొలి భారత ఓపెనర్గా నిలిచాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా వాంఖడే మైదానం వేదికగా గురువారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో సంజూ శాంసన్ (42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లతో 89) విధ్వంసకర హాఫ్ సెంచరీతో ఈ ఫీట్ సాధించాడు. ఈ టోర్నీలో సంజూ శాంసన్కు వరుసగా రెండో హాఫ్ సెంచరీ ఇది.
వెస్టిండీస్తో జరిగిన గత మ్యాచ్లో 97 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసిన సంజూ శాంసన్.. తాజా మ్యాచ్లోనూ అదే జోరు కనబర్చాడు. దాంతో విరాట్ కోహ్లీ పేరిట గత 10 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డ్ను సమం చేశాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో ఇదే వాంఖడే మైదానం వేదికగా వెస్టిండీస్తో జరిగిన సెమీఫైనల్లో విరాట్ కోహ్లీ 89 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్లోనూ సంజూ శాంసన్ సరిగ్గా 89 పరుగులే చేసి విరాట్ కోహ్లీ రికార్డ్న సమం చేశాడు.

ఓవరాల్గా ఐసీసీ టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్ల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాటర్గా సంజూ శాంసన్ నిలిచాడు. బుధవారమే సౌతాఫ్రికాతో జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్(34 బంతుల్లో 100 నాటౌట్) అజేయ సెంచరీతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. తాజా మ్యాచ్తో సంజూ శాంసన్ ఈ జాబితాలోకి ఎంట్రీ ఇచ్చాడు.

100* - ఫిన్ అలెన్ వర్సెస్ సౌతాఫ్రికా, కోల్కతా, 2026 సెమీ-ఫైనల్*
96 - తిలకరత్న దిల్షాన్ వర్సెస్ వెస్టిండీస్, ది ఓవల్, 2009 సెమీ-ఫైనల్*
89 - విరాట్ కోహ్లీ వర్సెస్ వెస్టిండీస్, ముంబై వాంఖడే స్టేడియం, 2016 సెమీ-ఫైనల్*
89* - సంజూ శాంసన్ వర్సెస్ ఇంగ్లండ్, ముంబై వాంఖడే స్టేడియం, 2026 సెమీ-ఫైనల్*
86 - అలెక్స్ హేల్స్ వర్సెస్ ఇండియా, అడిలైడ్, 2022 సెమీ-ఫైనల్*
85 - మార్లన్ శామ్యూల్స్ వర్సెస్ ఇంగ్లాండ్, కోల్కతా, 2016 ఫైనల్*
85 - కేన్ విలియమ్సన్ వర్సెస్ ఆస్ట్రేలియా, దుబాయ్, 2021 ఫైనల్
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. . సంజూ శాంసన్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. శివమ్ దూబే(25 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 43), ఇషాన్ కిషన్(18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 39) మెరుపులు మెరిపించారు. చివర్లో తిలక్ వర్మ(7 బంతుల్లో 3 సిక్సర్లతో 21), హార్దిక్ పాండ్యా(12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 27)దూకుడుగా ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో విల్ జాక్స్(2/40), ఆదిల్ రషీద్(2/41) రెండేసి వికెట్లు తీయగా... జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు 19 సిక్సర్లు, 20 ఫోర్లు బాదారు.
