ఆ ఫైనల్ రిపీట్.. పాక్ నెటిజన్ ఎగతాళి
ఇక భారత మహిళల ఓటమిని ఓ పాకిస్థాన్ నెటిజన్ ఎగతాళి చేశాడు. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో భారత పురుషుల జట్టు ఓడిన విషయం తెలిసిందే. దీన్ని ప్రస్తావిస్తూ ఈ మ్యాచ్ ఫలితమే పునరావృతమైందని ట్వీట్ చేస్తూ శునకానందం పొందాడు.
మీ జట్టు ఎన్ని నాకౌట్స్ ఆడిందో..?
ఈ ట్వీట్ చూసిన టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా సదరు పాక్ నెటిజన్కు దిమ్మతిరిగే రిప్లే ఇచ్చాడు. ఆ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ నుంచి పాక్ పురుషుల, మహిళల జట్లు ఎన్ని నాకౌట్స్ ఆడాయో? చెప్పాలంటూ ప్రశ్నించాడు. ‘ఆ(2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్) నుంచి మీ పురుషుల, మహిళల జట్లు ఎన్ని నాకౌట్స్ మ్యాచ్లు ఆడాయి? అద్దాలతో నిర్మించిన భవనాల్లో లైట్ కింద దుస్తులు మార్చుకోలేం.. మిత్రమా' అంటూ ఈ మాజీ ఓపెనర్ దిమ్మతిరిగే బదులిచ్చాడు.
అధైర్య పడకండి.. అద్భుతంగా ఆడారు.. ఏదో ఒక రోజు విజేతగా నిలుస్తారు: గంగూలీ
రెండు జట్లు సమమే..
ఇక ఈ ప్రపంచకప్ టోర్నీలో రెండు జట్లు సమంగా నిలిచాయని ఈ టెస్ట్ బ్యాట్స్మన్ మరో ట్వీట్ చేశాడు. ‘ఈ మెగా టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా ఒకే ఒక మ్యాచ్ ఓడాయి. ఆరంభ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓడితే.. ఫైనల్ మ్యాచ్లో భారత్ పరాజయం పాలైంది. ఇదే జీవితం అంటే...' అని సదరు నెటిజన్కు సూచించాడు.
ఆ ఫైనల్ తర్వాత ఒక్క నాకౌట్..
సర్ఫరాజ్ అహ్మద్ నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ను ఓడించి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఆ ఫైనల్ తర్వాత పాకిస్థాన్ పురుషుల జట్టు కానీ, మహిళల టీమ్ కానీ కనీసం నాకౌట్కు కూడా అర్హత సాధించలేదు. 2017 వన్డే వరల్డ్ కప్, 2018, 2020 టీ ప్రపంచకప్లలో పాకిస్థాన్ మహిళలు దారుణ ప్రదర్శనతో లీగ్ దశలోనే ఇంటి దారి పట్టారు. ఇక పాకిస్థాన్ పురుషుల జట్టు 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్ కూడా చేరలేదు.
కాకపోతే అండర్-19 పాక్ జట్టు మాత్రం ఇటీవల ముగిసిన కుర్రాళ్ల ప్రపంచకప్లో సెమీస్ చేరి భారత్ చేతిలోనే ఓడింది. ఇదొక్కటి మినహా ఆ జట్టు చాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత కనీసం నాకౌట్ దశకు కూడా చేరలేదు. ఇక భారత పురుషుల జట్టు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాతా వన్డే ప్రపంచకప్ సెమీస్ చేరింది. మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ ఫైనల్లో, 2018 టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో, తాజా ఫైనల్లో తలపడి.. విశ్వ కిరీటాన్ని తృటిలో చేజార్చుకుంది.