లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ ట్రోఫీని క్రొయేషియా ద్వయం నికోలా మెక్టిక్, మేట్ పావిక్ సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో నికోలా మె క్టిక్, మేట్ పావిక్ జోడీ 6-4, 7-6(5), 2-6, 7-5తో మార్సెల్ గ్రానోల్లర్స్(స్పెయిన్)-హోరాసియో జెబలోస్ల(అర్జెంటీనా) జోడీపై విజయం సాధించింది. వింబుల్డన్ టైటిల్ గెలిచిన మొదటి క్రొయేషియా డబుల్స్ జోడీగా మెక్టిక్-మెట్ జోడీ రికార్డు సృష్టించింది.
20 ఏళ్ల క్రితం అదే దేశానికి చెందిన గోరాన్ ఇవానిసెవిక్ పురుషుల సింగిల్స్ గెలుపొందాడు. మెక్టిక్-పావిక్ జంటకు ఈ సీజన్లో ఎనిమిదో టైటిల్ ఇది. 2018 ఆస్ట్రేలియా ఓపెన్తో పాటు యూఎస్ ఓపెన్ను పావిక్ వేర్వేరు భాగస్వాములతో కలిసి గెలుపొందాడు. మెక్టిక్కు మాత్రం ఇదే తొలి గ్రాండ్స్లామ్. టోక్యో ఒలింపిక్స్లోనూ వీరిద్దరూ జంటగా బరిలోకి దిగనున్నారు.
శనివారమే జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సువే(తైవాన్)-ఎలిస్ మెర్టన్స్(బెల్జియం జోడీ) 6-3,5-7, 7-9తో వెరోనికా కుడెర్మెటోవా- ఎలెనా వెస్నినా(రష్యా) ద్వయంపై విజయం సాధించిన వింబుల్డన్ టైటిల్ సొంతం చేసుకుంది. మహిళల సింగిల్స్ చాంపియన్గా ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్, వరల్డ్ నెంబర్ వన్ యాష్లే బార్టీ నిలిచింది. ఎనిమిదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన తుది పోరులో టాప్ సీడ్ యాష్లే బార్టీ 6-3, 6-7 (4/7), 6-3తో విజయం సాధించి వింబుల్డన్ చాంపియన్గా అవతరించింది. బార్టీ కెరీర్లో ఇది రెండో గ్రాండ్స్లామ్ టైటిల్. 2019లో ఆమె తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గింది. మరోవైపు 29 ఏళ్ల ప్లిస్కోవాకు రెండోసారి గ్రాండ్స్లామ్ ఫైనల్లో నిరాశ ఎదురైంది. 2016 యూఎస్ ఓపెన్ ఫైనల్లోనూ ప్లిస్కోవా రన్నరప్గా నిలిచింది.
కెరీర్లో 20వ గ్రాండ్ స్లామ్ కైవసం చేసుకొని టెన్నిస్ దిగ్గజాలు రోజర్ ఫెడరర్, రఫెల్ నాదల్ సరసన నిలిచేందుకు సెర్బియా గ్రేట్ నొవాక్ జొకోవిచ్ అడుగు దూరంలో నిలిచాడు. అంచనాలను అందుకుంటూ వింబుల్డన్ ఫైనల్కు దూసుకెళ్లిన వరల్డ్ నెంబర్ వన్ జొకో ఫస్ట్ గ్రాండ్ స్లామ్పై కన్నేసిన ఏడో సీడ్ ఇటలీ ప్లేయర్ మాటియో బెరెటినితో అమీతుమీకి రెడీ అయ్యాడు. ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమయ్యే పురుషుల సింగిల్స్ టైటిల్ ఫైట్లో బెరెటిని పని పట్టి తన టార్గెట్ను పూర్తి చేసుకోవాలని చూస్తున్నాడు.