ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026ను భారత్ గెలుచుకున్న నేపథ్యంలో స్టార్ ఆల్రౌండర్ శివమ్ దూబే సతీమణి అంజుమ్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ తీవ్ర చర్చనీయాంశమైంది. 'మాషా అల్లాహ్’ అంటూ ఆమె పేర్కొన్న అరబిక్ వ్యాఖ్యలు.. వారి లవ్ స్టోరీని మళ్లీ తెరపైకి తీసుకొచ్చాయి.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో శివమ్ దూబే అద్భుత ప్రదర్శన కనబర్చాడు. టీమిండియా ఫినిషర్గా విధ్వంసకర బ్యాటింగ్తో విలువైన పరుగులు జోడించాడు. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో శివమ్ దూబే ఆఖరి ఓవర్లో 24 పరుగులు చేసి సత్తా చాటాడు.

భారత్ చారిత్రక విజయం నేపథ్యంలో... అంజుమ్ ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో న్యూజిలాండ్పై దూబే విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగుతున్న ఫొటోను పంచుకుంది. ఆ ఫొటోకు 'మాషా అల్లాహ్, అల్హమ్దులిల్లాహ్. నస్రున్మినల్లాహి వ ఫత్బున్ కరీబ్. ఆమీన్ సుమ్మ ఆమీన్’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ఈ అరబిక్ పదాలకు 'అల్లా సంకల్పంతో.. అన్ని ప్రశంసలు అల్లాకే చెందుతాయి.
ఆయన దయతో విజయం ఆసన్నమైంది.’అని అర్థం. ఈ పోస్ట్తో శివమ్ దూబే ప్రేమాయణం మరోసారి చర్చనీయాంశమైంది. శివమ్ దూబే మతాంతర వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

1986 సెప్టెంబర్ 2న ఉత్తరప్రదేశ్లో జన్మించిన అంజుమ్ ఖాన్.. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ చదివారు. ఆమె మోడల్గా.. నటిగా, వాయిస్ ఆర్టిస్ట్గా కళా, వినోద రంగాల్లో పనిచేశారు. పలు బాలీవుడ్ చిత్రాలు, హిందీ సీరియళ్లు, మ్యూజిక్ వీడియోలకు డబ్బింగ్ కూడా చెప్పినట్లు సమాచారం.
మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా అంజుమ్ ఖాన్ను శివమ్ దూబే కలిసాడు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారం కోసం కొన్నాళ్లు వేచి చూసిన ఈ జోడీ.. వారు ఒప్పుకోవడంతో 2021 జులై 16న హిందూ, ముస్లిం సంప్రదాయాల ప్రకారం వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మత సామరస్యంతో జరిగిన వారి వివాహంపై విమర్శలు ఎదురైనా.. వారు దృఢంగా నిలిచారు. 2022లో ఈ దంపతులకు కుమారుడు అయన్ జన్మించగా.. 2025 ఆరంభంలో రెండో బిడ్డగా కుమార్తె మహ్వీష్ పుట్టింది. వివాహం తర్వాత కూడా, శివమ్ దూబే.. అంజుమ్ ఇద్దరూ తమ తమ మతాలను గౌరవంగా పాటిస్తున్నారు.
