ఐసీసీ టీ20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన టీమిండియాపై బీసీసీఐ కనక వర్షం కురిపించింది. రూ.131 కోట్ల భారీ క్యాష్ ప్రైజ్ను ప్రకటించింది. బోర్డు ప్రకటించిన మొత్తంలో ఆటగాళ్లకు ఎంత ఇస్తారనేది అధికారికంగా ప్రకటించకపోయినా.. ఒక్కో ప్లేయర్కు రూ. 6 కోట్లు చొప్పున అందజేయనున్నట్లు తెలుస్తోంది.
బీసీసీఐ భారీ క్యాష్ ప్రైజ్ ప్రకటించడంపై బోర్డు మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంగళవారం కోల్కతాలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన దాదా.. బోర్డు దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని చెప్పాడు. సంజూ శాంసన్ ప్రదర్శన తనకేం ఆశ్చర్యం కలిగించలేదని తెలిపాడు. కోచ్గా గంభీర్.. కెప్టెన్గా సూర్య.. ఆటగాళ్లు సమష్టిగా రాణించడంతోనే ఈ విజయం సాధ్యమైందని తెలిపాడు. ప్రస్తుతం గంగూలీకి సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.


రిపోర్టర్: బీసీసీఐ టీమిండియాకు రూ.131 కోట్ల క్యాష్ ప్రైజ్ ప్రకటించింది. హర్భజన్ సింగ్ మాత్రం ఇది చాలా తక్కువ అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?
సౌరవ్ గంగూలీ: క్యాష్ ప్రైజ్ అనేది బీసీసీఐ తీసుకున్న నిర్ణయం. అయినా అది చాలా పెద్ద మొత్తమే. వారి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి.
రిపోర్టర్: 2028 ఒలింపిక్స్లో బంగారు పతకం గెలవడమే తమ తదుపరి లక్ష్యమని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అంటున్నారు.
సౌరవ్ గంగూలీ: మనది మంచి జట్టు.. వారు ఎక్కడైనా గెలవగలరు.
రిపోర్టర్: సంజూ శాంసన్ ప్రదర్శన గురించి మీరేమంటారు?
సౌరవ్ గంగూలీ: మంచి ఆటగాడు. తను బాగా ఆడాడు, అందులో నాకు ఆశ్చర్యమేమీ లేదు.
రిపోర్టర్: గంభీర్ గురించి చెప్పాలంటే..?
సౌరవ్ గంగూలీ: గౌతమ్ గంభీర్ జట్టులో ఒక భాగం. అత్యంత కీలకమైన పాత్ర. టీమిండియా బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. కెప్టెన్గా సూర్య, కోచ్గా గంభీర్.. ఆటగాళ్లు అందరూ రాణిస్తేనే జట్టుకు విజయం దక్కుతుంది.
