ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో చోటు దక్కకపోవడంపై శ్రేయస్ అయ్యర్ కచ్చితంగా బాధపడి ఉంటాడని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. శుభ్మన్ గిల్ కంటే కూడా అయ్యర్ ఎక్కువ నిరాశకు గురై ఉంటాడని అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కని విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025 సీజన్లో అద్భుత ప్రదర్శన కనబర్చినా కూడా భారత టీ20 జట్టులో అతనికి అవకాశం దక్కలేదు. టీమ్ కాంబినేషన్ సెట్ అవ్వడంతోనే అయ్యర్కు అవకాశం ఇవ్వలేదని అప్పట్లో సెలెక్టర్లు వివరణ ఇచ్చారు.
ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన ఇర్ఫాన్ పఠాన్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అపార ప్రతిభ కలిగిన అయ్యర్కు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడం అతనికి జరిగిన అన్యాయమేనని అభిప్రాయపడ్డాడు.

'శ్రేయస్ అయ్యర్ నాణ్యమైన ఆటగాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లి.. 600 పైగా పరుగులు చేసినా అతన్ని వరల్డ్ కప్ టీమ్లోకి తీసుకోకపోవడం చాలా బాధాకరం. ఇది అతనికి జరిగిన అన్యాయమే. ఇంత పెద్ద టోర్నీలో భారత జట్టు గెలిచినప్పుడు.. అందులో తను లేకపోవడం ఏ ఆటగాడికైనా జీర్ణించుకోవడం కష్టం. అయ్యర్ కూడా మనసులో ఖచ్చితంగా బాధపడి ఉంటాడు.
అయ్యర్ ప్రస్తుతానికి ఓపిక పట్టాలి. అతను టీమ్లో ఉండడమే కాదు. భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్సీ రేసులో కూడా ఉండే అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలోని జట్టు యువ ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. బహుశా అయ్యర్ కెప్టెన్సీ లక్షణాలు ఉన్న ప్లేయర్ కాబట్టి.. టీమ్లో ఇప్పటికే ఉన్న కెప్టెన్సీ గ్రూప్ వల్ల అతన్ని పక్కన పెట్టి ఉండవచ్చు.

టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో చోటు దక్కకపోయినా.. అయ్యర్ తన నిలకడైన ప్రదర్శనను కొనసాగిస్తాడు. స్పిన్ బౌలింగ్ను సమర్థవంతంగా ఆడగలడు. పేసర్లపై కూడా అలవోకగా పరుగులు చేయగలడు. తన బ్యాటింగ్ను మరింత మెరుగుపర్చుకోవడంపై అయ్యర్ కచ్చితంగా ఫోకస్ పెడుతాడు. ఐపీఎల్ 2026 సీజన్లో కూడా అతను సత్తా చాటుతాడనే నమ్మకం నాకు ఉంది.'అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియా ప్లేయర్ కూపర్ కొన్నోలికి పంజాబ్ కింగ్స్ తుది జట్టులో చోటు దక్కుతుందా? అనే ప్రశ్నకు పఠాన్ తనదైన శైలిలో బదులిచ్చాడు. 'స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని అతన్ని ఆడించాలా? లేదా? అనేది పరిశీలిస్తారు. ప్రపంచకప్లో అతను పెద్దగా రాణించలేదు. శ్రీలంకలోని స్పిన్ పిచ్లపై అతను తేలిపోయాడు. అయితే అతను లెఫ్టార్మ్ స్పిన్నర్. బ్యాటింగ్ కూడా చేయగలడు. బిగ్ బాష్ లీగ్లో మైదానాలు భిన్నంగా ఉంటాయి. గత రెండేళ్లుగా ఈ లీగ్లో అతను నిలకడగా రాణించాడు. కానీ ఐపీఎల్లో రాణించడం అతనికి సవాల్తో కూడుకున్న విషయం'అని ఇర్ఫాన్ పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2026 వేలంలో పంజాబ్ కింగ్స్ కూపర్ కొన్నోలిని రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ పెర్త్ స్కార్చర్స్ ఆటగాడు ఇప్పటి వరకు 52 టీ20ల్లో 132.62 స్ట్రైక్రేట్తో 870 పరుగులు, 7.46 ఎకానమీ రేటుతో 30 వికెట్లు పడగొట్టాడు.
