టీమిండియా టీ20 తదుపరి కెప్టెన్గా సంజూ శాంసన్ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అన్నాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ ఫిట్గా ఉన్నంత కాలం అతనే టీ20 కెప్టెన్గా కొనసాగుతాడని కైఫ్ తెలిపాడు. అతను తప్పుకుంటే మాత్రం కెప్టెన్గా సంజూ శాంసన్ సరైన వ్యక్తి అని అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా రాణించిన అనుభవం సంజూ శాంసన్కు ఉందని కైఫ్ గుర్తు చేశాడు. ప్రపంచకప్లో అద్భుతమైన ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన 31 ఏళ్ల సంజూ టీమ్ను నడిపించగల సమర్థుడని కొనియాడాడు. తాజా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన కైఫ్.. టీమిండియా టీ20 కెప్టెన్సీకి కావాల్సిన అర్హతలన్నీ సంజూ శాంసన్కు ఉన్నాయని తెలిపాడు.

'టీమిండియా తదుపరి టీ20 కెప్టెన్ ఎవరవుతారో ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ ఆ బాధ్యతను సంజూ శాంసన్ అందుకునే అవకాశం ఉంది. నా ఉద్దేశం ప్రకారం అతను ఎందుకు కెప్టెన్ కాకూడదు? క్రికెట్లోని అన్ని పరిస్థితులను చూసి వ్యక్తి కెప్టెన్గా ఉండాలి. బౌలింగ్లో మార్పులు చేయడం.. సరైన ప్లేయింగ్ ఎలెవన్ను ఎంపిక చేయడం.. అలాగే అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి లాంటి ఫామ్ కోల్పోయిన ఆటగాళ్లకు అండగా నిలవడం వంటివి కెప్టెన్కు తెలిసి ఉండాలి. అనుభవం కలిగిన వ్యక్తికి ఇవన్నీ సహజమేనని అనిపిస్తుంది.

ఎందుకంటే వారు స్వయంగా అటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఉంటారు. ఈ చిన్న చిన్న విషయాలను అనుభవం కలిగిన వ్యక్తులు అర్థం చేసుకోగలరు. అందుకే సంజూ శాంసన్ కెప్టెన్సీ రేసులో ఉండే ఆటగాడని నేను భావిస్తున్నా. అయితే సూర్యకుమార్ యాదవ్ ఇలానే బాగా ఆడుతూ ఉంటే.. అతను మరికొంత కాలం ఆ పదవిలో కొనసాగవచ్చు. ఏ ఆటగాడైనా ఫిట్గా ఉంటే 38-39 ఏళ్ల వరకు ఆడవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు.
ముఖ్యంగా పొట్టి ఫార్మాట్లో అనుభవం చాలా అవసరం. గతంలో కెప్టెన్సీ చేసిన వారు ఎప్పుడూ విలువైన వారుగానే ఉంటారు. ఒకవేళ సూర్య తప్పుకోవాలని నిర్ణయించుకుంటే.. ఆ స్థానాన్ని సంజూ భర్తీ చేయగలడు. అతని ఐపీఎల్లో సుదీర్ఘ కాలం కెప్టెన్సీ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ను ఫైనల్కు కూడా తీసుకెళ్లాడు. అతనికి ప్రస్తుతం 31 ఏళ్లు మాత్రమే. అతనే తదుపరి భారత కెప్టెన్ కావచ్చు.'అని కైఫ్ చెప్పుకొచ్చాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో ఐదు మ్యాచ్లు ఆడిన సంజూ శాంసన్ 80.25 సగటు.. 199.37 స్ట్రైక్రేట్తో 321 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ టోర్నీలో సంజూ మొత్తం 27 ఫోర్లు, 24 సిక్స్లు కొట్టాడు. సింగిల్ ఎడిషన్ టీ20 ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా.. అత్యధిక సిక్స్లు కొట్టిన ప్లేయర్గా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల రికార్డులను అధిగమించాడు.
