భారత మాజీ క్రికెటర్, 1983 ప్రపంచకప్ విన్నర్ కీర్తి ఆజాద్పై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రీడల కంటే రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లు తమ విజయాన్ని నచ్చినట్లు సెలెబ్రేట్ చేసుకుంటారని చురకలు అంటించాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయానంతరం ట్రోఫీని గంభీర్, జైషా, సూర్య స్టేడియంలోని హనుమాన్ ఆలయంలోకి తీసుకెళ్లి పూజలు చేశారు. అయితే ఈ చర్యను కీర్తి ఆజాద్ తప్పుబట్టాడు. ఇది భారత జట్టుకు అవమానకరమని మండిపడ్డాడు. టీమిండియా ఏమైనా సూర్యకుమార్ యాదవ్, జైషా సొత్తా?అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. భారత విజయాన్ని ఒక మతానికి అంటగట్టడం ఏంటని ప్రశ్నించాడు.

కీర్తి ఆజాద్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ కామెంట్స్పై హర్భజన్ సింగ్ ఘాటుగా స్పందించాడు. గుడికి కాకపోతే చర్చి, మసీదుకు తీసుకెళ్తారు.. కీర్తి ఆజాద్కు వచ్చిన సమస్య ఏంటని నిలదీసాడు. 'దీని చుట్టూ రాజకీయాలు చేస్తూ ఆయన (కీర్తి ఆజాద్) ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. అతని వ్యాఖ్యలు చాలా అసంబద్ధంగా ఉన్నాయి. భారత జట్టు ఆ ట్రోఫీని గుడికి కాకపోతే చర్చి, మసీదు కూడా తీసుకెళ్లవచ్చు. అది వారి ఇష్టం. ఒకవేళ వాళ్లు తమ దేవుడిని ఏదైనా కోరుకుని, ఆ కోరిక తీరిన తర్వాత తమ నమ్మకం ప్రకారం అక్కడికి వెళ్తే అందులో తప్పేముంది?

తోటి క్రికెటర్ల నుంచి ఇలాంటి మాటలు వినడం చాలా దురదృష్టకరం. బహుశా ఆయన క్రీడల కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లున్నారు. ఆయన స్వయంగా ఒక క్రీడాకారుడై ఉండి ఇలా మాట్లాడటం బాధాకరం. దేశం ప్రపంచ కప్ గెలిచింది. అందరూ సంతోషంతో వేడుకలు చేసుకుంటున్నారు. కానీ కీర్తి ఆజాద్ మాత్రం రాజకీయాలు చేయడంలో బిజీగా ఉన్నారు. అన్ని మతాలు ఒక్కటే అని మా నమ్మకం. దేవుళ్లు వేరైనా.. మార్గం ఒక్కటే. వారు గుడికి వెళ్లినా, మసీదుకు వెళ్లినా.. చర్చికి వెళ్లినా ఒక్కటే. అది వారి వ్యక్తిగత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దాన్ని ప్రశ్నించడం సరికాదు.'అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.

ప్రపంచకప్ విజయానంతరం తన స్వస్థలం పాట్నా చేరుకున్న ఇషాన్ కిషన్ ముందు కీర్తి ఆజాద్ వ్యాఖ్యలను ప్రస్తావించగా.. సమాధానమిచ్చేందుకు నిరాకరించాడు. 'నేను ఇప్పుడే ఒక అద్భుతమైన ప్రపంచ కప్ను గెలిచాను. దయచేసి కొంచెం మంచి ప్రశ్నలు అడగండి. కీర్తి ఆజాద్ అన్న మాటల గురించి నేనేం చెప్పాలి? ఏవైనా మంచి విషయాలు అడగండి. వరల్డ్ కప్ గెలిచిన ఫీలింగ్ ఎలా ఉంది? మనం ఎంత ఎంజాయ్ చేశాం? ఇలాంటివి అడగండి.' అని ఇషాన్ కిషన్ అసహనం వ్యక్తం చేశాడు.