న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్కు భారత పేసర్ అర్ష్దీప్ సింగ్ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. తన ఆటగాళ్ల నుంచి తాను ఇలాంటి దూకుడునే కోరుకుంటానని గంభీర్ స్పష్టం చేశాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్లో డారిల్ మిచెల్ను అర్ష్దీప్ సింగ్ బంతితో కొట్టిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు సిక్స్లు బాదడంతో సహనం కోల్పోయిన అతను బంతిని బలంగా విసిరాడు. దాంతో డారిల్ మిచెల్ తీవ్ర ఆగ్రహానికి గురవ్వగా.. కెప్టెన్ సూర్య క్షమాపణలు చెప్పి అతన్ని శాంత పర్చాడు.
అంపైర్ మందలించడంతో ఓవర్ పూర్తయిన తర్వాత అర్ష్దీప్ సింగ్ సారీ చెప్పాడు. మ్యాచ్ అనంతరం కూడా క్షమాపణలు చెబుతూ అతనితో ఇన్స్టా రీల్ చేశాడు. ఐసీసీ కూడా అర్ష్దీప్ సింగ్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ కేటాయించింది.

తాజాగా ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఘటనపై మాట్లాడిన గంభీర్.. అర్ష్దీప్ సింగ్కు అండగా నిలిచాడు. 'అది పెద్ద సమస్య కాదు. దేశం తరఫున ప్రాతినిథ్యం వహించేటప్పుడు దూకుడు చూపించాల్సిన అవసరం ఉంది. బంతిని విసిరితే తప్పేంటి? వరుసగా రెండు సిక్స్లు కొట్టించుకోవాలని ఏ బౌలర్ అనుకోడు కదా? ఆ తర్వాత బంతికి అతను అలా చేశాడు. నా ఆటగాళ్ల నుంచి నేను ఇలాంటిదే కోరుకుంటా. అందులో ఎలాంటి తప్పులేదు. ఒకవేళ అతను సారీ చెప్పకపోయినా సరే.. వచ్చే సమస్య ఏం లేదు.
క్షమాపణలు చెప్పాల్సిన అసవరం కూడా లేదు. అయితే, సారీ చెప్పి అర్ష్దీప్ సింగ్ మంచి పని చేశాడు. మైదానంలోకి దిగాక ఎవరూ స్నేహితులు ఉండరు. ఎవరూ శత్రువులు కారు. దేశం కోసం ఆడేటప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. కానీ సోషల్ మీడియా తరంలో ప్రతీది తప్పుబట్టడమే అవుతోంది. అంత అవసరం లేదు.'అని గంభీర్ పేర్కొన్నాడు.
తాను నవ్వకపోవడానికి గల కారణాన్ని కూడా గంభీర్ వెల్లడించాడు. 'నేను సీరియస్గా ఉంటానని కామెంట్లు చేసేవారు ఎప్పుడూ ఇలాంటి బాధ్యతల్లో ఉండి ఉండరు. కఠిన పరిస్థితులు ఉన్నప్పుడు డగౌట్లో కోచ్గా నేను నవ్వుతూ ఉండలేను. భారత జట్టుపై భారీ అంచనాలు ఉంటాయి. ఇక్కడ ఓటమి అనేది ఆప్షన్ కాకూడదు. ప్రతీ ప్రపంచకప్ను టీమిండియానే నెగ్గాలని కోరుకుంటారు. ప్రతీసారి ఎలా వర్కౌట్ అవుతుంది. ఇది స్పోర్ట్స్... జీవితమంతా కష్టపడ్డా ఫలితాలు వస్తాయనే గ్యారంటీ లేదు. ఇదేమీ షేర్ మార్కెట్ కాదు.'అని గంభీర్ పేర్కొన్నాడు.