తొలి ఆఫ్రికా మహిళగా..
గురువారం అర్ధరాత్రి జరిగిన సెమీఫైనల్లో జెబ్యూర్ 6-1, 6-3తో ఫ్రాన్స్కు చెందిన 17వ సీడ్ కరోలిన్ గార్సియాను చిత్తుచేసింది. గంటా ఆరు నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో ఆరంభం నుంచే దూకుడుగా చెలరేగిన జెబ్యూర్ వరుససెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించింది. ఈ గెలుపుతో గార్సియా వరుస 13 మ్యాచ్ల విజయానికి జెబ్యూర్ బ్రేక్ వేసింది. తొలిసెట్లో ఒకే ఒక గేమ్ నెగ్గిన గార్సియా.. జెబ్యూర్ సంధించిన బలమైన షాట్లకు ఏ దశలోనూ బదులివ్వలేకపోయింది. ఏకంగా 8 ఏస్లతో విరుచుకుపడిన జెబ్యూర్ 21 విన్నర్లను సంధించింది. గార్సియా 2 ఏస్లు, 12 విన్నర్లతో సరిపెట్టుకుంది. జెబ్యూర్ రెండుసార్లు డబుల్ ఫాల్ట్ చేసినా.. తనకు లభించిన 4 బ్రేక్ పాయింట్లను సద్వినియోగం చేసుకొంది. ఈ విజయంతో యూఎస్ ఓపెన్లో ఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా మహిళగా 28 ఏళ్ల జెబ్యూర్ చరిత్ర సృష్టించింది.
స్వియటెక్ జోరు..
మరో సెమీఫైనల్లో ప్రపంచ నెంబర్వన్ స్వియటెక్ 3-6, 6-1, 6-4తో ఆరోసీడ్ సబలెంక (బెలార్స)ను ఓడించింది. 2 గంటలా 11 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో స్వియటెక్ తొలిసెట్ కోల్పోయినా అద్భుతంగా పుంజుకొని తర్వాతి సెట్లలో పైచేయి సాధించింది. 2 ఏస్లు సంధించిన స్వియాటెక్ 3 డబుల్ఫాల్ట్లు, 31 అనవసర తప్పిదాలు చేయగా, సబలెంక 4 ఏస్లు కొట్టి ఏడుసార్లు డబుల్ఫాల్ట్లు చేసింది. 44 అనవసర తప్పిదాలు చేసింది.
తొలి పొలాండ్ ప్లేయర్గా
ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్ (2020, 2022)తో రెండు మేజర్ టైటిళ్లను ఖాతాలో వేసుకున్న 21 ఏళ్ల స్వియటెక్.. తాజా విజయంతో యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరిన తొలి పోలెండ్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:30 గంటలకు ఈ ఆఖరి పోరు ఆరంభమవుతుంది.