న్యూయార్క్: ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్లో నాలుగో సీడ్ నవోమి ఒసాకా, అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ క్వార్టర్స్ చేరగా.. ఆరోసీడ్ పెట్రా క్విటోవా ఇంటిదారి పట్టింది. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్స్లో ఒసాకా(జపాన్) 6-3,6-4తో 14 సీడ్ కొంటావిట్(ఇస్తోనియా)పై గెలిచింది. క్విటావో(చెక్ రిపబ్లిక్) 6-7(5-7), 6-3,6-7(6/8)తో షెబ్లీ రోజర్స్(అమెరికా) చేతిలో పోరాడి ఓడిపోయింది. ఇక సెరెనా విలియమ్స్ 6-3, 6-7(6-8), 6-3తో సక్కారిపై విజయం సాధించగా.. పుటిన్త్సెవా 6-3, 2-6, 6-4తో 8వ సీడ్ పెట్రా మార్టిక్పై గెలిచి క్వార్టర్స్కు చేరారు.
పురుషుల సింగిల్స్లో జ్వెరేవ్ 6-2, 6-2, 6-1తో డేవిడోవిచ్పై, షపోవలోవ్ 6-7, 6-3, 6-4, 6-3తో గాఫిన్పై, కోరిచ్ 7-5, 6-1, 6-3తో థామ్సన్పై గెలిచి క్వార్టర్స్ చేరారు. ఇక తన కోపమే తనకు శత్రువున్నట్లు.. వరల్డ్ నెంబర వన్, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ లైన్ జడ్జ్ను గాయపర్చి వేటుకు గురైన విషయం తెలిసిందే. ఉద్దేశపూర్వకంగా చేయనప్పటికి తాను చేసిన తప్పిదానికి బాధ్యత వహిస్తున్నట్లు చెబుతూ యావత్ టెన్నిస్ లోకానికి క్షమాపణలు చెప్పాడు. ఇక నొవాక్ అర్ధంతర నిష్క్రమణతో ఈసారి యూఎస్ ఓపెన్ కళ తప్పినట్టయింది.
ఎందుకంటే టోర్నీకి ముందే నడాల్, ఫెడరర్ వైదొలగడంతో జకోవిచ్కు టైటిల్ ఖాయమనే అనుకున్నారంతా. కానీ ఇప్పుడు అతను క్వార్టర్స్కు ముందే వెళ్లడంతో బిగ్ త్రీ కాకుండా మరో ఆటగాడు విజేత కాబోతున్నాడు. 2004 నుంచి 2019 వరకు గత 16 ఏళ్లలో యూఎస్ ఓపెన్ను 12 సార్లు ఫెడరర్, నడాల్, జకోవిచ్లలో ఒకరు గెలుచుకున్నారు. అందుకేనేమో.. ఇక టోర్నీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయని జర్మనీ స్టార్ జ్వెరేవ్ అన్నాడు.
US Open 2020: ఫ్రస్టేషన్లో లైన్ జడ్జ్ను కొట్టిన నొవాక్ జకోవిచ్.. డిస్క్వాలిఫై చేసిన నిర్వాహకులు!