
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరి శిక్ష పడిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం తీహార్ జైల్లో నలుగురు దోషులు ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31) ఉరి కొయ్యలకు వేలాడారు. ఈ శిక్ష అమలుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ట్విటర్లో స్పందించింది. ఏడేళ్ల తర్వాత నిర్భయ ఆత్మ శాంతించిందని, ఇనేళ్లు ధైర్యంగా పోరాడిన ఆ తల్లికి సెల్యూట్ అంటూ ట్వీట్ చేసింది.
'ఏడేళ్ల తరువాత నిర్భయ ఆత్మకు శాంతి లభించింది. న్యాయం ఆలస్యమైంది కానీ తిరస్కరించబడలేదు. ఇన్నాళ్లు ధైర్యంగా పోరాడిన ఆ తల్లికి వందనం. నిర్భయకు న్యాయం జరిగింది. నిర్భయ గెలిచింది.'అని ట్వీట్లో రాసుకొచ్చింది.
అంతకు ముందు ఈ శిక్ష అమలుపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. 'చివరికి న్యాయమే గెలిచింది. మన నారీమణులు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. వారికి భద్రతతో పాటు మరింత గౌరవాన్ని పెంచాల్సిన అవసరముంది. అన్ని రంగాల్లో సమానత్వం, అవకాశాల కల్పన ఎంతో ముఖ్యం. మహిళా సాధికారత దిశగా దేశం అడుగులు వేయాలి. దీనికి అందరూ కృషి చేయాలి' అని ట్వీట్ చేశారు.
అయితే, మరణ దండన నుంచి తప్పించుకునేందుకు న్యాయపరమైన అవకాశాల పేరుతో దోషులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఉరి శిక్ష అమలుకు రెండు గంటల ముందు వరకు దోషుల ప్రయత్నాలు ఆగలేదు. ఢిల్లీ హైకోర్టులో అర్ధరాత్రి వరకు వాదనలు కొనసాగాయి. ఉరిపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీంతో వారు మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నిర్భయ దోషుల చివరి పిటిషన్ను శుక్రవారం తెల్లవారు జామున 3:30 గంటలకు సుప్రీం కోర్టు కొట్టివేసింది.